Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను తెలివిగా వాడేస్తున్న మోడీ..?

By:  Tupaki Desk   |   7 April 2020 11:30 PM GMT
కేసీఆర్ ను తెలివిగా వాడేస్తున్న మోడీ..?
X
జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనించండి. దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావటం వెనుక ఏం జరిగి ఉంటుంది? మరెవరికి రాని ఐడియా కేసీఆర్ కు మాత్రమే వచ్చిందా? కరోనాకు లాక్ డౌన్ కు మించిన తరుణోపాయం కొత్తదేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చేసింది.. చేస్తున్నది కూడా అదే. కరోనాకు కన్నతల్లిలాంటి వూహాన్ నగరం కూడా మూతేసి.. ఇంట్లో నుంచి జనాల్ని రానివ్వని తర్వాతే కదా.. పిశాచి వైరస్ కాస్త శాంతించింది. మరి.. లాక్ డౌన్ మీద దేశంలోని ఇంతమంది సీఎంలు మౌనంగా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరు విప్పటమే కాదు.. ప్రధానమంత్రికి వినతి అంటూ చేసిన పొడిగింపు అభ్యర్థన వెనుకున్న మర్మం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

దేశంలో చక్రం తిప్పాలని తపించిన కేసీఆర్.. ఆ క్రమంలో మోడీని అంతలా విమర్శలు చేసిన ఆయన.. ఆయన ఎవరండి.. ప్రధానమంత్రి. ఆయన్ను మాట అనటమా? అంటూ చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు.. అలాంటి మాటలు అనగలిగే సత్తా సారుకు మాత్రమే సొంతమనాలి. ఏది ఏమైనా తిట్టినా.. పొగిడినా.. అది కేసీఆర్ చేస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. సోమవారం రాత్రి నిర్వహించిన ప్రెస్ మీట్లో లాక్ డౌన్ పొడిగింపుపై కేసీఆర్ నోటి వెనుక వచ్చిన ప్రపోజల్ వెనుక ప్రధానమంత్రి మోడీ ఉన్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఎక్కువమంది బీజేపీకి చెందిన వారే. వారెవరూ నోరు తెరిచి లాక్ డౌన్ పొడిగింపు మాట చెప్పే ధైర్యం చేయరు. ఒకవేళ చేసినా.. అదెలా తిరుగుతుందోనన్న సందేహం. ఇలాంటివేళ.. బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేకుండా.. ఎవరినైనా తన మాటల తో కన్వీన్స్ చేసే సత్తా ఉన్న అధినతతో ఒక ప్రపోజల్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనే కేసీఆర్ నోట మాట వచ్చేలా చేసిందా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. కేసీఆర్ కు మేధావి అన్న ఇమేజ్ తో పాటు.. సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకుండే గుర్తింపు ఉండనే ఉంది. తన మాటతో షురూ అయ్యే చర్చ.. చివరకు ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించి లాక్ డౌన్ ను పొడిగిస్తే.. ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలోనే పడుతుంది. మేధావి ఇమేజ్ మరింత బలపడుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిన్నటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ నోటి నుంచి ఒక మాట వచ్చింది గమనించారా? తాము ప్రతి ఏటా రూ.30వేల కోట్ల అప్పులు కడుతుంటామని.. తమకు ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో వాటిని వాయిదా వేయాలని కోరుతామని చెప్పారు. అలాంటి ఇబ్బందులతో పాటు.. కేంద్రం నుంచి సాయం పొందాల్సి పరిస్థితులు భవిష్యత్తులో బోలెడన్నివచ్చే అవకాశం ఉన్నప్పుడు.. కనుచూపు మేర ఎన్నికలు లేనప్పుడు కేంద్రానికి దగ్గరగా ఉంటే నష్టమేమీ ఉండదు కదా? ఇలాంటి ఈక్వేషన్లు కేసీఆర్ కు ఉంటే.. మోడీ ప్లానింగ్ మోడీకి ఉంటుంది కదా? ఇప్పటికే లాక్ డౌన్ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీని ప్రశంసించే వారు ఉన్నట్లే.. విరుచుకుపడేందుకు ప్రతిపక్షాలు కొన్ని సిద్ధంగా ఉన్నాయి. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివేళ.. లాక్ డౌన్ పొడిగింపు ప్రజల్లో వ్యతిరేకత పెంచకుండా చేయటమే కాదు.. రాజకీయ పార్టీలు సైతం మౌనంగా ఉండేందుకు వీలుగా కేసీఆర్ ను తెర మీదకు తీసుకొచ్చారా? అన్నదిప్పుడు ప్రశ్న. దానికి సమాధానం ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో రావటం ఖాయమంటున్నారు.