Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంటికి డాక్టర్లను పంపుతానన్న మోడీ

By:  Tupaki Desk   |   19 July 2016 12:52 PM IST
కేసీఆర్ ఇంటికి డాక్టర్లను పంపుతానన్న మోడీ
X
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సమస్యల విషయంలో ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పు.. నిప్పులా ఉండే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపరీతమైన దగ్గుతో కిందామీదా పడిపోతూ.. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేని సమయంలో.. ఆయన అవస్థల్ని గుర్తించి.. తనకు తానే ఒక వైద్యుడ్ని సూచించి.. ప్రకృతి వైద్యం చేయించుకోవాలని చెప్పటం.. దాన్ని అమల్లో పెట్టిన కేజ్రీవాల్ ఆరోగ్యం కుదుటపడటం తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రుల ఆరోగ్యాల విషయంలో చాలా కేర్ తీసుకునే మోడీ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ సందర్భంగా ఆయన ఆరోగ్య ముచ్చట గురించి పదే పదే అడిగి తెలుసుకోవటమే కాదు.. ఎయిమ్స్ వైద్యుల్ని ఇంటికి పంపుతానంటూ ఆయన చెప్పటం గమనార్హం.

‘‘కేసీఆర్ జీ అంతా ఓకేనా? ఆరోగ్యం బాగుందా? ఎయిమ్స్ డాక్టర్లను ఇంటికి పంపమంటారా? రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి విశ్రాంతి తీసుకొని వెళ్లండి’’ అంటూ అప్యాయంగా అడిగినట్లుగా చెబుతున్నారు. అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో గంటన్నర సేపు మాత్రమే ఉన్న కేసీఆర్.. తనకు జ్వరంగా ఉండటంతో.. నీరసంగా ఉన్న ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోవటం తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా తనను కలిసిన కేసీఆర్ తో.. ఎయిమ్స్ వైద్యుల్ని ఇంటికి పంపుతానని చెప్పటమే కాదు.. మొహమాటం వద్దని చెప్పటం గమనార్హం.

మోడీ పరామర్శకు కేసీఆర్ బదులిస్తూ.. హైదరాబాద్ నుంచి తన వ్యక్తి అయుర్వేదం వైద్యుడ్ని పిలిపించుకొని మందులు వేసుకున్నట్లుగా చెప్పటంతో పాటు.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగున్నట్లుగా మోడీకి తెలిపారు. ఏమైనా.. గుర్తు పెట్టుకొని మరీ కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రస్తావించటమే కాదు.. ఇంటికే ఎయిమ్స్ వైద్యుల్ని పంపుతానన్న మాటలతో మనసు దోచుకున్నారని చెప్పక తప్పదు.