Begin typing your search above and press return to search.

మోడీ వెంట వెళ్లిన వైద్యులు ఎక్కడి వారు?

By:  Tupaki Desk   |   11 April 2016 11:46 AM IST
మోడీ వెంట వెళ్లిన వైద్యులు ఎక్కడి వారు?
X
ఏదైనా విపత్తుచోటు చేసుకున్నప్పుడు అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలు పర్యటించటం.. పరామర్శలు చేయటం మామూలే. కానీ.. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే ప్రధాని మోడీ.. ఆదివారం కేరళలోని కొల్లం ఆలయంలో బాణసంచా పేలిన ఘటనలో తనదైన శైలిలో పరామర్శలు చేపట్టారు. 106 మంది మరణించి.. వందలాది మంది కాలిన గాయాలతో విలవిలలాడుతున్న సమాచారాన్ని అందుకున్న మోడీ.. వెనువెంటనే ఎవరూ ఊహించని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు.

బాధితుల్ని పరామర్శించేందుకు.. జరిగిన విషాద ఘటనను పరిశీలించేందుకు హుటాహుటిన బయలుదేరిన ఆయన.. ఆ స్వల్ప సమయంలోనే కాలిన గాయాలకు చికిత్స చేసే విషయంలో పెద్ద పేరు ప్రఖ్యాతులున్న వైద్యుల బృందాన్ని సిద్ధం చేశారు. వైద్యులు.. వైద్య సిబ్బందితో కూడిన బృందంతో ఆయన కేరళలో వాలిపోయారు. మరి.. ప్రధాని మోడీ తీసుకెళ్లిన వైద్య బృందంలో అంత పేరు మోసిన వైద్యులు ఎవరు? వారు ఏ ఆసుపత్రుల్లో పని చేస్తున్నారన్నది చూస్తే.. కొల్లం ఘటనకు మోడీ ఇచ్చిన ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతుంది.

ఢిల్లీలోని ప్రఖ్యాత వైద్య సంస్థలైన ఎయిమ్స్.. రాం మనోహర్ లోహియా.. సప్దర్ జంగ్ ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యుల్ని మోడీ తన వెంట తీసుకెళ్లటం గమనార్హం. సప్దర్ జంగ్ ఆసుపత్రి నుంచి 10 మంది.. ఎయిమ్స్ నుంచి 11 మంది.. రాం మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి ఐదుగురు డాక్టర్లతో పాటు.. కాలిన గాయాలకు చికిత్స చేసే నిపుణులు.. ప్లాస్టిక్ సర్జన్లు.. బర్న్ సర్జన్లు.. సాంకేతిక నిపుణులు.. అనెస్థటిస్టులు.. నర్సులు.. పారా మెడికల్ సిబ్బంది.. అత్యవసర మందులు.. అయింట్ మెంట్లు తీసుకెళ్లారు. ఈ బృందంతో మోడీ కేరళకు వెళ్లే సమయానికి అక్కడి డాక్టర్లు వైద్య సాయం అందిస్తున్నా.. ఈ ప్రముఖ వైద్యులతో ప్రత్యేక చికిత్సను అందించటం ద్వారా ప్రధాని మోడీ అందరి మనసుల్ని దోచుకున్నారు. పరామర్శించటం అంటే.. వెళ్లి రావటం కాదని.. బాధితులకు అసలుసిసలు సాయం అందేలా చూడటమన్న మాటను స్పష్టం చేస్తూ.. పరామర్శలకు మోడీ కొత్త అర్థం చెప్పారని చెప్పాలి.