Begin typing your search above and press return to search.

పీవోకే సొంతానికి మోడీ సర్కార్ ప్లానింగ్?

By:  Tupaki Desk   |   8 Oct 2019 7:59 AM GMT
పీవోకే సొంతానికి మోడీ సర్కార్ ప్లానింగ్?
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మోడీ సర్కారుకు ముందు మనదైన కశ్మీరం గురించి గట్టిగా గొంతు విప్పలేని దుస్థితి. తరచూ డిఫెన్స్ లో పడిపోయిన తీరుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తోంది మోడీ సర్కారు. కశ్మీర్ పై మడతపేజీ పెట్టే పాక్ కు దిమ్మ తిరిగిపోయే ప్లాన్ ను సెట్ చేసింది. న్యాయబద్ధంగా కశ్మీర్ పై హక్కు ఉన్న మనం ఆత్మరక్షణలో పడేడేందన్న ప్రశ్నకు గత పాలకుల చేతకానితనంగా చెప్పాలి.

ఈ తీరును పూర్తిగా మార్చేయటమే కాదు.. పాక్ కు అర్థమయ్యే రీతిలో ప్లానింగ్ చేస్తున్న మోడీ సర్కారు పుణ్యమా అని ఇప్పుడు దాయాదికి ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. కశ్మీర్ గురించి మాట్లాడటం కంటే కూడా.. తాము ఆక్రమించిన ముజఫర్ నగర్ ను ఎలా కాపాడుకోవాలా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

తాము ఆక్రమించిన పీవోకేను భారత్ సొంతం చేసుకుంటుందని.. భారత త్రివర్ణ పతాకం పీవోకే ఎగరటమే లక్ష్యమన్న విషయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొదలు ప్రధాని.. కేంద్రమంత్రులు.. ఆర్మీ చీఫ్ తదితరులు అదే పనిగా ప్రకటనలు గుప్పిస్తున్న వైనం తెలిసిందే. గతానికి భిన్నంగా మారిన భారత్ తీరుతో పాక్ ఆత్మరక్షణలో పడటమే కాదు.. మోడీ సర్కారు దూకుడ్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తల పట్టుకున్న పరిస్థితి. అయితే.. తప్పు తన మీద పెట్టుకోవటానికి భారత్ సిద్దంగా లేదంటున్నారు.
భారత్ ను కవ్వించే చర్యను చేపట్టినంతనే పాక్ భరతం పట్టేందుకు.. ఇప్పటివరకూ కలలో కూడా ఊహించని పరిణామాలకు మోడీ సర్కారు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. భారత్ లో తరచూ మారణహోమానికి కారణమయ్యే ఉగ్రవాదులకు సాయం చేసే పాక్.. ఇప్పుడు అదే ఉగ్రవాదులు ఎలాంటి చర్యా చేపట్టకూడదని కోరుకుంటోంది.

పీవోకే (పాక్ అక్రమిత కశ్మీర్)ను స్వాధీనం చేసుకోవటానికి భారత్ సిద్ధంగా ఉన్నా.. తనకు తానుగా దాడికి పాల్పడకూడదన్న స్వీయ నియంత్రణను పెట్టుకుంది. దీంతో.. సరైన సమయం కోసం వెయిట్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. పాక్ నుంచి పుల్వామా తరహా దాడి కానీ.. ఏదైనా కవ్వింపు చర్య జరిగినంతనే పీవోకేపై భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. ఇందుకు అవసరమైన అంతర్జాతీయ మద్దతును కూడగట్టటం.. పాక్ ప్రయత్నాల్ని దెబ్బ తీసేందుకు అవసరమైన అన్ని చర్యల్ని మోడీ సర్కారు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

పాక్ అక్రమిత కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి ఇప్పుడున్న సమయమే సరైనదని చెబుతున్నారు. ఆర్థికంగా పాక్ దారుణ పరిస్థితుల్లో ఉండటం.. ప్రభుత్వం బలహీనంగా ఉందన్న మాట వినిపిస్తోంది. యూరీ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నునిర్వహించటం తెలిసిందే. ఈ ఘటనకు పాక్ నుంచి సరైన ప్రతిస్పందన లేకపోవటంతో భారత్ మరింత ధైర్యాన్ని పుంజుకుందన్న మాట వినిపిస్తోంది. పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారతవాయుసేన దాడి చేయటం తెలిసిందే.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో పాక్ అక్రమిత కశ్మీర్ భారత్ అంతర్భాగమని వాదించే పాలకపక్షం.. ఆర్మీ అధికారులు తొలిసారి చూస్తున్నదే. గతంలో ఈ భావన ఉన్నా.. అంత ధైర్యం చేసేందుకు ఏ పాలక పక్షంగా సిద్దపడలేదు. దీనికి భిన్నంగా మోడీ సర్కారు మాత్రం.. తన హయాంలో కశ్మీర్ ను మొత్తంగా భారత భూభాగంగా మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

దీనికి అనుగుణంగానే భారత విదేశాంగమంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. పీవోకే ఏదో ఒక రోజు భారత్ పాలన కిందకు వస్తుందన్న మాటను చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో జరగాల్సిన దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను మోడీ సర్కారు సిద్ధం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు మోడీ సర్కారు తర్వాతి అడుగును చెప్పేస్తున్నాయని చెప్పాలి.

దీర్ఘకాలం అవసరమయ్యే ఆయుధాల కొనుగోళ్లను పక్కన పెట్టిన భారత్.. తక్షణం యుద్ధం వస్తే అవసరమైన ఆయుధాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం వెనుక అసలు విషయం.. పీవోకేను సొంతం చేసుకోవటంగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ నుంచి ట్యాంక్ విధ్వంసక క్షిపణుల్ని.. స్పైక్ బాంబుల్ని అత్యవసరంగా కొనుగోలు చేయటం.. వివిధ ఆయుధాలకు అవసరమైన మందుగుండు సామాగ్రిని దిగుమతి చేసుకోవటం.. పాక్ సరిహద్దుల్లో సుఖోయ్ విమానాల్ని మొహరించటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయటం గమనార్హం. మొత్తంగా.. పాక్ ఒక్క తప్పటడుగు వేసినా.. భారత్ చేజారిన పీవోకే లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటమే మిషన్ గా మోడీ సర్కారు పెట్టుకుందన్నమాట బలంగా వినిపిస్తోంది.