Begin typing your search above and press return to search.

వన్ నేషన్ - వన్ మార్కెట్ : కీలక నిర్ణయం ప్రకటించనున్న మోదీ !

By:  Tupaki Desk   |   1 Jun 2020 6:00 PM IST
వన్ నేషన్ - వన్ మార్కెట్ : కీలక నిర్ణయం ప్రకటించనున్న మోదీ !
X
వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఐదో దశ లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మోడీ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తీ అయిన సందర్భంగా మొదటిసారి కేంద్ర కేబినెట్ భేటీ అయింది. లాక్ ‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో దేశంలోని రైతులందరికీ తీపి కబురు అందించనుంది మోదీ ప్రభుత్వం. వన్ నేషన్- వన్ మార్కెట్ (ఒకే దేశం - ఒకే మార్కెట్) అన్న విధానాన్ని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. ఇకపై రైతులు పండించిన ఉత్పత్తులను ఎవరికైనా... ఎక్కడైనా మంచి ధర కోసం విక్రయించడానికి వీలుగా ఈ విధానాన్ని ఆర్డినెన్స్ రూపంలో తేనున్నట్లు సమాచారం.

ఢిల్లీలోని ఉన్నతాధికారులు అన్యాపదేశంగా ఈ మేరకు సంకేతాలిచ్చారు. అలాగే ఈ భేటీలో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై కూడా కేంద్ర కేబినెట్ చర్చించనుంది. లాక్ డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.