Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై కోర్టుకెళ్తున్న సోము వీర్రాజు

By:  Tupaki Desk   |   22 Aug 2018 11:48 AM IST
చంద్రబాబుపై కోర్టుకెళ్తున్న సోము వీర్రాజు
X
ఏపీ సీఎం చంద్రబాబుపై నిత్యం విరుచుకుపడే సోము వీర్రాజు కొన్నాళ్లుగా సైలెంటుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబుపై పెద్దగా విరుచుకుపడిన దాఖలాలు లేవు. అయితే ఇదంతా తుపాను ముందు ప్రశాంతత అని ఆ పార్టీ నేతలు అంటుండేవారు. అందుకు తగ్గట్లుగానే ఆయన తాజాగా చంద్రబాబుపై భారీ ఆరోపణలు చేశారు. అంతేకాదు... చంద్రబాబును అవినీతి ఆరోపణపై కోర్టుకీడ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాననీ చెప్పారు.

విజయనగరం జిల్లాలో నిర్మించనున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ ను రియల్ ఎస్టేట్ సెజ్ గా మార్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. భోగాపురం నుంచి బాత్రూమ్ ల వరకు చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చినా జీఎంఆర్ కు కట్టబెట్టాలని చూశారని, భోగాపురం - కర్నూలు - ఓర్వకల్లు - నెల్లూరు ఎయిర్ పోర్ట్ లను చంద్రబాబు వ్యాపారమయం చేస్తున్నారని ఆరోపించారు.

భోగాపురం టెండర్ డాక్యుమెంట్ విషయమై కేంద్ర మంత్రిని కలిసిన సంగతిని ఆయన ప్రస్తావించారు. ఉపాధి హామీ దోపిడీపైనా కేంద్రానికి ఫిర్యాదు చేశామని, కేంద్ర పథకాలు ఏపీకి ఉపాధి హామీల్లా మారాయని - చంద్రబాబుపై కోర్టుల్లో కేసులు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని - సీబీఐ విచారణ కోసం కోర్టులకు వెళతామని సోము వీర్రాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఆయన సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.