Begin typing your search above and press return to search.

జేసీ అల్లుడి కుట్ర‌ను హైకోర్టు బ‌య‌ట‌పెట్టింది

By:  Tupaki Desk   |   5 July 2017 6:33 AM GMT
జేసీ అల్లుడి కుట్ర‌ను హైకోర్టు బ‌య‌ట‌పెట్టింది
X
హైద‌రాబాద్‌ నగరంలో విలువైన భూములను మాయచేసి చేజిక్కించుకోవడంలో సిద్ధహస్తుడ‌నే పేరు సంపాదించి టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి మరో బండారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్ బోజగుట్టలో సుమారు రూ.300 కోట్ల విలువ చేసే భూములను సొంతం చేసుకునేందుకు పావులు కదిపిన దీపక్‌ రెడ్డి.. లేని వ్యక్తుల పేరిట 14 పిటిషన్లు దాఖలుచేయించి కోర్టును మోసగించే ప్రయత్నం బయటపడింది. ఆ కుట్రలను ఉమ్మడి హైకోర్టు భగ్నం చేసింది. దీపక్‌ రెడ్డితోపాటు అతడి వ్యాపార భాగస్వామి - న్యాయవాది శైలేశ్‌ సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఏ రామలింగేశ్వర్‌ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రార్‌ ను విచార‌ణ‌కు ఆదేశించింది.

హైదరాబాద్‌ లోని గుడిమల్కాపూర్ బోజగుట్టలో ఉన్న ప్రభుత్వ భూమిని అయోధ్యనగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ కు 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సొసైటీ సభ్యులకు పంపిణీ కూడా జరిగింది. కోట్ల విలువ చేసే ఈ భూమిపై దీపక్‌ రెడ్డి - శైలేశ్ సక్సేనా కన్నేశారు. అది ప్రభుత్వ భూమికాదని, నిజాం కాలం రికార్డుల ప్రకారం భూమి యజమాని సర్దార్‌ అలీఖాన్‌ గా పేర్కొంటూ.. అతని వారసులుగా ఇక్బాల్ ఇస్లాంఖాన్ - నజీమొద్దీన్ ఇస్లాంఖాన్ - హబీద్ ఇస్లాంఖాన్ - ఇఫ్తేకర్ ఇస్లాంఖాన్ - షకీల్ ఇస్లాంఖాన్‌ లను ముందుకు తెచ్చారు. ఇక్బాల్ ఇస్లాంఖాన్ పేరిట పిటిషన్ దాఖలు చేయించారు. నిజానికి ఇక్బాల్‌ ఇస్లాంఖాన్ అనే వ్యక్తి లేనేలేడు. శివభూషణం అనే వ్యక్తిని ఇక్బాల్ వేషంలో ప్రవేశపెట్టారు. తదనంతరం ఇక్బాల్ మరణించినట్లుగా పేర్కొన్నారు. షకీల్ బషీర్ అనే వ్యక్తిని తెచ్చి.. ఇతడే ఇక్బాల్ వారసుడు షకీల్ అని పేర్కొన్నారు. భూమిపై హక్కులు కోరుతూ షకీల్ పేరిట 2008 - 2009 - 2012లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు.

ఇవి పెండింగ్‌ లో ఉండగానే వివాదంలో ఉన్న భూమిని జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు విక్రయించడానికి షకీల్‌ తో ఒప్పందం చేసుకున్నట్టు పత్రాలు సృష్టించారు. కోర్టులో కేసువేశారు. జై హనుమాన్ ఎస్టేట్స్ యజమాని ఎవరో కాదు...స్వయానా న్యాయవాది శైలేశ్‌ సక్సేనా తండ్రి. ఈ వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నది. కేసుల విచారణ సమయంలో భూమి వారసుల విషయాన్ని అయోధ్యనగర్ సొసైటీ సభ్యులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా షకీల్ ఇస్లాంఖాన్ - తదితరుల తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు హాజరుకాలేదు. షకీల్ ఇస్లాంఖాన్ - నజీముద్దీన్ ఇస్లాంఖాన్ - హబీద్ ఇస్లాంఖాన్ - ఇఫ్తేకర్ ఇస్లాంఖాన్ తదితరుల నివాసాలకు వెళ్లి నోటీసులు అందచేయాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ రామలింగేశ్వర్‌ రావు ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు సిబ్బంది వెళ్లగా.. అసలు ఆ పేర్లతో సదరు చిరునామాల్లో ఎవరూ లేరని తేలింది. ఇదే విషయాన్ని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై సమగ్రంగా పలు కోణాల్లో విచారించిన కోర్టు.. షకీల్ తదితరులు బోజగుట్ట భూమిపై దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. దీప‌క్ రెడ్డి ఎపిసోడ్‌ను బ‌య‌ట‌పెట్టింది.