Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే త‌మ్ముడైనా.. ద‌ళిత బంధుకు అర్హులేన‌ట‌.. ప్ర‌భుత్వం వివ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   29 March 2022 11:00 PM IST
ఎమ్మెల్యే త‌మ్ముడైనా.. ద‌ళిత బంధుకు అర్హులేన‌ట‌.. ప్ర‌భుత్వం వివ‌ర‌ణ‌
X
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌నంగా భావిస్తున్న కీల‌క ప‌థ‌కం .. ద‌ళిత బంధు. ఒక్కొక్క ద‌ళిత కుటుం బానికి రూ.10 ల‌క్షల చొప్పున ల‌బ్ధి చేకూర్చే ప‌థ‌కం ఇది. దీనిని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్నా రు. ఎస్సీలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. వారి ఉపాధి మార్గానికి ఆర్థిక ఆసరాను కల్పించి.. సమాజంలో గౌరవంగా బతకాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ పథకం ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే.. ఈ ప‌థ‌కంలో పలుచోట్ల కొన్ని అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

రాజకీయ నాయకుల పలుకుబడి ఉపయోగించి ఆర్థిక స్థితి మంచిగా ఉన్నవారు సైతం ఈ పథకానికి అర్హులుగా పేరు నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుచరు లు, కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోదరుడు, ఘన్‌పూర్‌ సర్పంచి సురేశ్‌కుమార్‌ పేరు ఉండటం గమనార్హం.

పైన పేర్కొన్న జాబితాలో 4వ పేరు తాడికొండ సురేష్‌కుమార్‌. ఈయ‌న కు ద‌ళిత బంధు ప‌థ‌కం ఖ‌రారైంది. అధికారులు కూడా ఓకే చేసేశారు. కానీ, ఈయ‌న ఎమ్మెల్యే సోద‌రుడు. అంటే.. నిబంధ‌న‌ల‌ ప్ర‌కారం.. ప్ర‌జాప్ర‌తినిధుల బంధువుల‌కు ప‌థ‌కాలు వ‌ర్తించ‌కూడ‌దు. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం అమ‌లు చేసేస్తోంది. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. దళితబంధు పథకంలో ఎస్సీల్లో పేదలకే ఇవ్వాలనే నిబంధన లేదని, ప్రభుత్వ ఉద్యోగులు కాని 60 ఏళ్ల లోపు వారు అంతా అర్హులేనని వివరించారు. ఈ విష‌యం ప్ర‌భుత్వ‌మే స్ప‌ష్టంగా చెప్పింద‌న్నారు.

ఇటీవల 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ.. జాబితాలో లేని ఇతర ఆశావహ కుటుంబాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ప్రస్తుతం గోప్యత పాటిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల్లో తమ అనుచరులను, అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల నేతల అనుచరులు.. ఎంపిక చేసిన లబ్ధిదారులతో వాటాలు(రూ.2-4 లక్షలు) మాట్లాడుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చేర్చారని కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నారాయణపేట, గద్వాలలో పేదలను కాకుండా ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్నవారిని మరోసారి ఎంపిక చేస్తున్నట్లు అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే.. ద‌ళిత బంధు ప‌థ‌కం.. రాజ‌కీయ రాబందుల‌కు వ‌రంగా మారింద‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.