Begin typing your search above and press return to search.

ఉద్యోగాలపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   20 March 2021 5:30 PM IST
ఉద్యోగాలపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
X
తెలంగాణలో గత కొన్నాళ్లుగా ఉద్యోగ ప్రకటనలు లేక.. నియామకాలు లేక నిరుద్యోగులు చచ్చుబడిపోయారు. పోయిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత అంతా బీజేపీ వైపు చేరి షాకిచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ చర్చ ప్రధాన అంశమైంది. ఎందుకంటే ఇవి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ లు కావడంతో సర్కార్ హామీలిచ్చింది. 2020 వరకు లక్షా 32వేల 899 ఉద్యోగాలు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని సర్కార్ చెబుతోంది.

అయితే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని.. అవన్నీ తప్పుడు ప్రకటనలు అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను కూడా ఉద్యోగాలు ఇచ్చిన జాబితాలో చూపిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలు కలిపేశారని అంటున్నారు.

ఈ విషయంపై తాజాగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఒక కీలక ప్రకటన చేశారు. రాబోయే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహన రంగాల్లో రాష్ట్రానికి రూ.70వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తద్వారా 3 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

ఇక కొత్తగా రాష్ట్రానికి మరో 40 పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. వాటికి 30 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు ఆటోమేటిక్ గా రద్దు అవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు