Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ను తలదన్నేరాజధాని అంటే ఒక్క విశాఖతోనే సాధ్యం !

By:  Tupaki Desk   |   30 Dec 2019 6:02 AM GMT
హైదరాబాద్ ను తలదన్నేరాజధాని అంటే ఒక్క విశాఖతోనే సాధ్యం !
X
ఏపీ లో మూడు రాజధానుల రగడ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. దీనిపై మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యం అని , ఒక ప్రణాళిక బద్ధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ రిపోర్టుల పై హై పవర్ కమిటీ ఇచ్చే నివేదికను సమన్వయం చేస్తామని, నిపుణుల కమిటీ నివేదిక పై ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసిందని తెలిపారు. హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదిక పై కేబినెట్‌ లో చర్చిస్తామని మంత్రి తెలిపారు.

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టాలని, సీఎం క్యాంప్ ఆఫీస్, సెక్రటేరియట్ పెట్టాలని నివేదిక లో ఉంది. అమరావతి ప్రాంతంలో శాసనసభతో పాటు సీఎంకు మరో క్యాంప్ ఆఫీస్, గవర్నర్ బంగ్లా ఉండాలని, కర్నూలులో హైకోర్టు పెడుతూనే, అమరావతి, విశాఖలో ఓ బెంచ్ ఉండాలని నివేదిక చెప్పింది. రాష్ట్ర విభజన సమయం లో మనమంతా ఒకటే బాధపడ్డాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్లీ మనం తయారుచేసుకోగలమా అని బాధపడ్డాం. హైదరాబాద్ ను తలదన్నే నగరం తయారవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం తోనే సాధ్యం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ బొత్స మరోసారి మూడు రాజధానుల పై తన నిర్ణయాన్ని తెలియజేసారు.

అలాగే ఇదే సమయంలో మూడు రాజధానుల పై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన రాకముందే ఆరోపణలు చేయడం సరి కాదని , రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా గత ప్రభుత్వం నడిపిన చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా ఖర్చు చేశారని బొత్స ఆరోపించారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటిగా ఉందని.. అలాంటి నగరాన్ని విస్మరించి రాజధాని గురించి ఆలోచించడంలో అర్థంలేదన్నారు. ఏ రకంగా ఆలోచించినా విశాఖకు మించిన నగరం లేదు. ఈ నగరానికి ఏమాత్రం చేయూతనిచ్చినా, దీన్ని హైదరాబాద్ ను తలదన్నే నగరంగా తయారుచేసుకోవచ్చు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవచ్చు అని తెలిపారు. రాజధాని అంశానికి సంబంధించి కేంద్రానికి సమాచారం ఇస్తే సరి పోతుందని, వాళ్లకు రిపోర్ట్ ఇచ్చి చర్చలు జరపాల్సిన అవసరం లేదని , రాష్ట్రం లో ఎక్కడ రాజధాని నిర్మించుకున్నప్పటికీ, విభజన చట్టం ప్రకారం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.

అలాగే , మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను లక్ష కోట్ల అప్పుల్లో ముంచారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లక్ష కోట్ల అప్పు చేసి రాజధాని కోసం రూ. 5వేల కోట్లే ఖర్చు చేశారని.. అందులో కేంద్రం రూ. 1500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాంతానికి చంద్రబాబు వల్ల ఏదైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే గత ఐదేళ్ల కాలం లో చంద్రబాబు, ఆయన బంధువులు భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాలకృష్ణ వియ్యంకుడికి, ఆయన కుమారుడికి అక్రమంగా భూములు కేటాయించారని అన్నారు. అలాగే రాజధాని ప్రాంత రైతుల గురించి మాట్లాడుతూ ..త ప్రభుత్వం చెప్పినట్టు గానే హామీల్ని అమలు చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. దీని పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తున్నప్పటికీ రైతులని కావాలనే టీడీపీ మభ్యపెట్టి ధర్నాలు చేసేలా ఉసిగొల్పుతున్నారని అయన ఆరోపించారు.