Begin typing your search above and press return to search.

కరెంట్ బిల్లు చెల్లింపుపై మంత్రి బొత్స క్లారిటీ

By:  Tupaki Desk   |   1 May 2022 9:35 AM GMT
కరెంట్ బిల్లు చెల్లింపుపై మంత్రి బొత్స క్లారిటీ
X
తాను హైదరాబాద్ లోని ఇంటికి కరెంట్ బిల్లు కట్టలేదని సాగుతున్న ప్రచారంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్ శాఖ ఆ ట్వీట్ చేయలేదని.. ఫేక్ ఐడీతో ఎవరో ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని బొత్స తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని.. తాను కరెంట్ బిల్లు కట్టానని.. ఆధారాలను సైతం ట్విట్టర్ లో పోస్టు చేశారు.

బొత్స ఫోన్ పే తెలంగాణలోని ఇంటి కరెంట్ బిల్లు కట్టిన వివరాలను షేర్ చేశారు. ఎవరో కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. 'సత్యం గెలుస్తుంది' అని పేర్కొన్నారు. మంత్రి బొత్స వివరణతోనైనా ఇది ముగుస్తుందో లేదో చూడాలి.

ఇటీవల ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు సరిగా లేవని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇటీవల ఏపీ మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ నుంచే వచ్చానని.. అక్కడి తన ఇంట్లో కరెంట్ లేకుంటే జనరేటర్ వేసుకున్నానని ఎద్దేవా చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ కూడా ధీటుగా సమాధానమిచ్చాడు. 'బొత్స' కరెంట్ బిల్లు కట్టలేదేమో అందుకే తీసేశారు.. హైదరాబాద్ లో కరెంట్ ఎప్పుడూ పోదని హితవు పలికారు.

ఇక బొత్స చేసిన ఈ కౌంటర్ కు తాజాగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చినట్టుగా ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే ఈ పోస్ట్ ఫేక్ అని తర్వాత తెలిసింది. TSSPDCL పేరుతో బొత్స సత్యనారాయణకు కౌంటర్ గా ఓ ట్విట్టర్ ఖాతాలో ఏప్రిల్ 30న ఓ ట్వీట్ చేసినట్టు ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. 'బొత్స గారు.. మీరు కరెంట్ బిల్లు 15 నెలల నుంచి కట్టడం లేదు. అందుకే కరెంట్ కట్ చేశాం.. కరెంట్ బిల్లులను కట్టేస్తే వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తాం' అని ఆ ట్విట్టర్ అకౌంట్ లో ఉంది.

మంత్రి బొత్స కరెంట్ బిల్లు కట్టలేదని ట్వీట్ చేసి ఉన్న ట్విట్టర్ అకౌంట్ TSSPDCL పేరుపైనే ఉన్నా దాన్ని @isocialsaint నిర్వహిస్తోంది. కానీ TSSPDCL అధికారికంగా నిర్వహిస్తున్న ఖాతా ఇది కాదని బయటపడింది. ఇది ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా కాదు. తెలంగాణ విద్యుత్ శాఖ నిర్వహించే TSSPDCL ఖాతాలో బొత్సపై ఎలాంటి ట్వీట్లు లేవు. ఇదొక నకిలీ ఖాతా అని తేలింది.

అచ్చం అధికారిక ట్విట్టర్ ఖాతాలాగానే కనిపిస్తోంది. TSSPDCL పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి ఇలా బొత్సకు ట్యాగ్ చేసి నకిలీ పోస్ట్ చేసినట్టు తేలింది. అయితే ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ నిజంగానే తెలంగాణ విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చిందని అందరూ భ్రమపడ్డారు.

ఈక్రమంలోనే TSSPDCL సంస్థ బొత్సకు కౌంటర్ ఇచ్చిందన్న వార్తలపై విద్యుత్ సంస్థ సీఎండీ రఘురామరెడ్డి స్పందించారు. ఈ వార్త బోగస్ అని.. సంస్థ ట్విట్టర్ ఖాతాలో ఎలాంటి ట్వీట్ చేయలేదని డిస్కం సీఎండీ రఘురామరెడ్డి తెలిపారు. సంస్థ పేరు మీద ఇలాంటి అసత్యప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థపేరుతో అసత్య ప్రచారం చేయవద్దని విన్నవించారు.ఇప్పుడు బొత్స ఆధారాలు కూడా బయటపెట్టడంతో ఈ కరెంట్ బిల్లు వివాదం ముగిసినట్టైంది.