Begin typing your search above and press return to search.

వైసీపీ ప్ర‌భుత్వం.. 'మ‌నంద‌రి ఖ‌ర్మ‌' జ‌డ్పీటీసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   25 Nov 2022 12:30 PM GMT
వైసీపీ ప్ర‌భుత్వం.. మ‌నంద‌రి ఖ‌ర్మ‌ జ‌డ్పీటీసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంకా ప్రారంభం కూడా చేయ‌ని 'ఇదేం ఖ‌ర్మ‌' పేరుతో వైసీపీ నాయ‌కులు.. కొంద‌రు త‌మ సొంత ప్ర‌భుత్వంపైనే కామెంట్లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల సర్వసభ్య సమావేశం జ‌రిగింది. దీనికి హాజ‌రైన వైసీపీ నేత‌, జ‌డ్పీటీసీ స‌భ్యుడు కాయ‌ల ర‌మ‌ణ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 'వైసీపీప ప్ర‌భుత్వం మ‌నంద‌రి ఖ‌ర్మ‌' అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. అనంత‌రం స‌భ్యుల‌కు ద‌ణ్ణం పెడుతూ.. నిష్క్ర‌మించారు.

'గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మించుకుందామన్నా నిధులు లేవు. గతంలో తీర్మానించిన పనులకూ అతీగతీ లేదు. ఇలాగైతే ఈ సమావేశాలకు విలువ ఎలా ఉంటుంది? ఇది అందరు సర్పంచులు అనుభవిస్తున్న ఖర్మ.. దీనిపై తీర్మానించి అందరూ సంతకాలు పెడితే పైకి పంపిద్దాం' అని వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ స‌మావేశంలో పలువురు సభ్యులు మాట్లాడారు. గతంలో తీర్మానించిన పనులూ జరగడం లేదని వాపోయారు. ప్రతినెలా సమావేశాలు నిర్వహించడమే తప్ప ప్రయోజనం లేదని అన్నారు. చాలామంది గైర్హాజరు కావడానికి ఇదే కారణమని వాపోయారు. సమావేశంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు పీలు సాధ్విమణి, వెంకటరమణ, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

అయితే, స‌భ్యుల‌ను శాంతిప‌జేసేందుకు చైర్మ‌న్ ప‌లుమార్లు ప్ర‌య‌త్నించారు. డిమాండ్ల‌ను జిల్లా ఇంచార్జ్ మంత్రికి పంపిద్దామ‌ని, అవ‌స‌ర‌మైతే.. సీఎం జ‌గ‌న్‌ను కూడా క‌లుద్దామ‌ని స‌ర్దిచెప్ప బోయారు. అయిన‌ప్ప‌టికీ.. స‌భ్యులు త‌మ ఆగ్ర‌హాన్ని నియంత్రించుకోలేక పోయారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఒక్క‌టంటే ఒక్క రోడ్డువేయ‌గ‌లిగారా? అంటూ.. నిల‌దీశారు. దీంతో్ స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.