Begin typing your search above and press return to search.

భారత అమ్ములపొదిలోకి ‘మేఘా’

By:  Tupaki Desk   |   15 Jun 2020 5:53 AM GMT
భారత అమ్ములపొదిలోకి ‘మేఘా’
X
ఇంజనీరింగ్ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మేఘా సంస్థ ఇప్పుడు భారత అమ్ముల పొదిలోని ఆయుధాలు తయారు చేసే రంగంలోకి దిగింది. దేశ రక్షణను బలోపేతం చేసేందుకు నడుం బిగించింది. మౌలిక వసతుల నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తాజాగా దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, పరికరాలను తయారు చేసేందుకు అనుమతిని సంపాదించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య పారిశ్రామిక శాఖల నుంచి ఆదేశాలు అందుకుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ మంత్రిత్వ శాఖలు అనుమతులు మంజూరు చేశాయి.

మేఘా సిగలో ఇప్పటికే ఎన్నో రంగాలు..

మేఘా సంస్థ ఇంజనీరింగ్ రంగంతోపాటు దాని అనుబంధమైన ఎన్నో రంగాల్లోకి ప్రవేశించి అద్భుతాలు సృష్టిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది. దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో అడుగుపెట్టి ఆ తరువాత చమురు-ఇంధన వాయువు, విద్యుత్, సౌరవిద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ తాజాగా దేశ రక్షణకు సంబంధించిన పరికరాల ఉత్పత్తి రంగంలో ప్రవేశించి అద్భుతం సృష్టించింది. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసింది. ఈ పరిణామంతో మేఘా అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరింది.

మేకిన్ ఇండియాలో ‘మేఘా’నేనుసైతం..

కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా విధానంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020 కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడిపరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతులను జారీ చేసింది. వివిధ దశల్లో 500 కోట్ల పెట్టుబడితో మేఘా గ్రూప్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. మేఘా గ్రూప్ కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్ర-సంకేతిక రంగాల్లో సహాయ-సహకారాలు అందిస్తున్న విషయం విధితమే. ఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ తో పాటు విద్యుత్ ప్రసారం పంపిణీ, సౌర రంగల్లో కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అధునాతన కమ్యూనికేషన్ రెడియోలు, జామర్లు, ఈడబ్లూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరాలో నిమగ్నమయి ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

మేఘా ఏం తయారు చేయనుంది?

మేఘా సంస్థ దాదాపు 500 కోట్లతో తెలంగాణలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ రక్షణ రంగ ఉత్పత్తి పరికరాల సంస్థను ఏర్పాటు చేయబోతోంది. యుద్ధ వ్యూహతంత్రానికి సంబంధించిన వాహనాలు (టిఎంఏవి), మందపాతరలను తట్టుకోగలిగే వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్) ఉత్పత్తి చేసేందుకు మేఘాకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఇవేకాక.. డిఫెన్స్ పరిశ్రమలో ప్రధానంగా యుద్ధట్యాంకులు.. వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపిసి) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగగలిగే యుద్ధ వాహనాలు (ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది.

మేఘా సిగలో ఎన్నెన్నో పరిశ్రమలు.. ఇప్పుడు రక్షణరంగం కూడా..

మేఘా సిగలో ఇప్పటికే ఎన్నెన్నో రంగాల పరిశ్రమలున్నాయి. ఐకామ్ టెలి విద్యుత్ ప్రసారం, పంపిణీ, సౌర, చమురు, గ్యాస్ రంగాలకు మేఘా విస్తరించినట్టు ఉంది. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లోకి అడుగుపెట్టి అవకాశాలను అందిపుచ్చుకుంది. భారత క్షిపణి కార్యక్రమాలకు అధునాతన కమ్యూనికేషన్ రేడియోలు, జామర్ యాంప్లిఫైయర్లు, కంటైనర్స్ ను సరఫరా చేస్తుంది. ఈ సంస్థ భారత వైమానిక దళానికి ‘విండ్ ప్రొఫైల్ రాడార్’ను అభివృద్ధి చేసింది. అదే విధంగా యుద్ధంలో కీలకంగా ఉపయోగించే హొవిట్జర్స్, యాంటి ట్యాంక్ వెపన్స్, రైఫిల్స్ తదితర యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేయడానికి అనుమతి సాధించింది.