Begin typing your search above and press return to search.

తాలిబన్ రాజ్యంలా కాశ్మీర్ మారిందా?

By:  Tupaki Desk   |   1 Aug 2016 5:04 AM GMT
తాలిబన్ రాజ్యంలా కాశ్మీర్ మారిందా?
X
తాలిబన్ల హవా నడిచే చోట పరిస్థితులు ఎంత ఆరాచకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కాశ్మీర్ లో అలాంటి పరిస్థితి ఉందా? అన్న సందేహం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు వింటే కలగటం ఖాయం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అల్లర్లతో కాశ్మీర్ లో పరిస్థితులు దిగజారాయి. ఎప్పుడూ లేని కొత్త పోకడలు కొత్తగా పుట్టుకు వచ్చినట్లుగా ఆ సీఎమ్మే చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఈ మాటలు కొత్త ఆందోళనల్ని రేకెత్తించేలా ఉండటం గమనార్హం.

గత నెలలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానిని భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేయటం తెలిసిందే. జులై 8న చోటు చేసుకున్న ఈ ఘటన అనంతరం కశ్మీర్ లోయ మొత్తంగా అట్టుడికిపోయింది. అల్లర్లు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో స్థానిక కాశ్మీరీ ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికంగా చెలరేగిన అల్లర్లను అదుపు చేసే క్రమంలో భద్రతా దళాలు జరుపుతున్న కాల్పులతో పరిస్థితి మరింత దిగజారుతున్న దుస్థితి.

ఇదిలా ఉంటే.. కాశ్మీర్ లో తాజాగా చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ తూటాలు.. గ్రెనేడ్లు సమస్యలకు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు. '‘పదేళ్ల కుర్రాడు షాపు నిర్వాహకుల్ని కొడుతున్నాడు.. ముసుగులు ధరించిన పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. స్కూటీల్ని నడిపే అమ్మాయిల్ని తగలబెట్టేస్తామంటున్నారు. మహిళల్ని.. వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి కాశ్మీర్ నా మనం కోరుకుంది?’’ అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్ని ఆందోళనలు ఉన్నా.. కాశ్మీర్ లోయలో మహిళల పట్ల దాడులు జరగటం.. అమర్యాదకరంగా వ్యవహరించటం కనిపించదు. అలాంటి చోట.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. తాలిబన్ పోకడల్ని కొందరు వ్యాప్తి చేస్తున్నట్లు కనిపించక మానదు. అదే జరిగితే.. పెద్ద ముప్పే కాశ్మీర్ ను పొంచి ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.