Begin typing your search above and press return to search.

బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసినోళ్లు మనకు దేశభక్తి పాఠాలు చెప్పటమా?

By:  Tupaki Desk   |   23 Dec 2021 4:07 AM GMT
బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసినోళ్లు మనకు దేశభక్తి పాఠాలు చెప్పటమా?
X
సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.. బీజేపీకి ఒకప్పటి మిత్రురాలు అయిన మెహబూబా ముఫ్తీ. కేంద్రం లోని మోడీ సర్కారు మీదా.. బీజేపీ మీదా ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. దేశభక్తి గురించి లెక్చర్లు ఇస్తున్నారంటూ ఆమె పడిన మండిపాటు ఆశ్చర్యాన్ని రేకెత్తించేలా మారింది. బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వారు ఈ రోజున దేశ ప్రజలకు దేశభక్తి గురించి లెక్చర్లు ఇస్తున్నారంటూ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు.

శ్రీనగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కేంద్రంలోని మోడీ సర్కారు మీద నిప్పులు చెరిగారు. బీజేపీని జిన్నాతో పోల్చిన ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆమె నోటి నుంచి కత్తి మొనలాంటి వ్యాఖ్యల్ని చూస్తే.. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జవహార్‌ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్ సయ్యద్ అహ్మద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ లతో సమ పోరాటం చేసిన మహ్మద్ అలీ జిన్నాను మనం ఈరోజు విమర్శిస్తున్నాం.

ఎందుకంటే ఆయన మీద మనకు ఒక ఫిర్యాదు ఉంది. ఈ దేశ విభజనకు కారకుడని ఆయన పక్కన పెట్టేశాం. హిందూ-ముస్లింల ప్రాతిపదికన జిన్నా ఈ దేశాన్ని విడదీశారు. కానీ ఈరోజు దేశంలో జరుగుతున్నదేంటి? ఎంతో మంది జిన్నాలు ఈ దేశంలోని ప్రజలను అదే మత ప్రాతిపదికన విడదీస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వాళ్లు ఈరోజు మనకు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారు’’ అని మండిపడ్డారు.

ఇంత తీవ్రంగా మోడీ అండ్ కో మీద విరుచుకుపడిన వారు ఇప్పటివరకు లేరనే చెప్పాలి. అంతేకాదు.. నిత్యం దేశ భక్తి గురించి మాట్లాడే పెద్ద మనషుల పార్టీ.. దేశ స్వాతంత్య్ర సమయంలో వారి పాత్ర ఏమిటన్న ప్రశ్న తలెత్తేలా ఆమె వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మరి.. మొహబూబా చేసిన వ్యాఖ్యలపై కమలనాథులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.