Begin typing your search above and press return to search.

ఆ లేడీ సీఎం ఎందుకు ఏడ్చారు?

By:  Tupaki Desk   |   22 July 2016 11:53 AM GMT
ఆ లేడీ సీఎం ఎందుకు ఏడ్చారు?
X
హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత క‌శ్మీర్ అల్ల‌క‌ల్లోలంగా మారిపోయింది. క‌ర్ఫ్యూలు - కాల్పులతో భ‌యానన వాతావ‌ర‌ణం అక్క‌డ ఏర్ప‌డింది. పెద్ద‌ ఎత్తున ఆందోళ‌న‌లు చెల‌రేగుతున్నాయి. అల్ల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2వేల మంది గాయాల‌తో చికిత్స పొందుతున్నారు. తాజా ప‌రిస్థితులు అక్క‌డి సీఎం - పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని తీవ్రంగా క‌ల‌చివేశాయి. ఆమె దీనిపై మాట్లాడుతూ ఏకంగా కంట‌త‌డి పెట్టుకున్నారు.

క‌ల్లోలం నేప‌థ్యంలో అనంత్‌ నాగ్ జిల్లాలో ప‌ర్య‌టించిన ఆమె అక్క‌డి ప‌రిస్థితుల‌ను - అల్ల‌ర్ల కార‌ణంగా అమాయ‌క ప్ర‌జ‌లు ఎదుర్కుంటోన్న స‌మ‌స్య‌ల‌ను కళ్లారా చూశారు. రాష్ట్రం అంత‌గా అల్ల‌క‌ల్లోలం కావ‌డంపై ఆవేద‌న చెందారు. అనంత‌రం ఆమె అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.

కశ్మీర్‌ లో ప్ర‌శాంత వాతావ‌రణం నెల‌కొల్పేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని ఆకాంక్షించిన ఆమె ఇలంటి ప‌రిస్థితుల‌ను ఊహించ‌లేద‌ని గ‌ద్గ‌ద స్వ‌రంతో చెప్పారు. అనంత్‌ నాగ్‌ లో అల్ల‌ర్ల‌ను అదుపుచేసేందుకు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో అక్క‌డి చిన్నారులు సహా చాలా మంది కంటి చూపు కోల్పోయారని ఆమె బాధప‌డ్డారు.

కాగా కాశ్మీర్ లో ప‌రిస్థితులు ఈ ఏడాది అమ‌ర‌నాథ్ యాత్ర‌ను కూడా స‌జావుగా సాగ‌కుండా చేశాయి. క‌ర్ఫ్యూలు - కాల్పుల నేప‌థ్యంలో కొన్ని రోజుల పాటు యాత్ర వాయిదా ప‌డింది. ఆ త‌రువాత కూడా భ‌యాందోళ‌నల కార‌ణంగా యాత్రికులు త‌గ్గిపోయారు. దీంతో ప్ర‌తిష్థాత్మ‌క అమ‌ర‌నాథ్ యాత్ర ఈసారి క‌ళ త‌ప్పింది.