Begin typing your search above and press return to search.

రాతలు సరే..సీమాంధ్రుల ఘోష రాయరా?

By:  Tupaki Desk   |   28 May 2016 5:57 AM GMT
రాతలు సరే..సీమాంధ్రుల ఘోష రాయరా?
X
ఒకరికి పండుగ.. మరొకరికి విషాదం ఎంతమాత్రం కాకూడదు. కొన్ని నిర్ణయాలు అందరికి సంతృప్తిని కలిగించలేవు. అలాంటప్పుడు వీలైనంత తక్కువ అసంతృప్తి ఉండేలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విభజన కారణంగా తీవ్రమైన అన్యాయానికి గురైనట్లుగా ఫీలయ్యే సీమాంధ్ర ప్రజల విషయాన్ని అటు కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రమే కాదు.. బాధ్యత కలిగిన మీడియా సైతం స్పందించకపోవటంపై ఏపీ ప్రజలు రగిలిపోతున్నారు.

మోడీ సర్కారు కేంద్రంలో కొలువుదీరి రెండేళ్లు అవుతుందంటే.. ఏపీ ప్రజలు విభజనకు గురై రెండేళ్లు అయిన విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పెద్ద సంబరంగా జరుపుకుంటున్నాయంటే.. ఏపీకి తీరని నష్టం వాటిల్లి రెండేళ్లు అయినట్లే. విభజన కారణంగా ఏపీకి నష్టం జరిగిందన్న విషయం అందరూ ఒప్పుకునేదే అయినా.. ఆ నష్ట తీవ్రతను తగ్గించే విషయంలో ప్రభుత్వాలు ఏమీ ప్రయత్నించకపోవటం.. ఆ నష్టాల తీవ్రత గురించి ప్రజల గొంతుక కావాల్సిన మీడియా అందుకు భిన్నంగా వ్యవహరించటం సీమాంధ్రుల్ని మరింత మండిపోయేలా చేస్తుంది.

కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ రెండేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసిన విషయాన్ని తాటికాయంత అక్షరాలతో ప్రత్యేక పేజీలు ఏర్పాటు చేసి మరీ మీడియాలో రాసేస్తున్న పరిస్థితి. మరింత భారీగా రాతలు రాసేస్తున్న వారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల ప్రయాణం మీదన ప్రత్యేక కథనాల్ని అచ్చేస్తున్నారు. దీన్ని తప్పు పట్టటానికి ఏమీ లేదు.

ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలానే ఇబ్బందులు ఎదురవుతాయన్న అంచనాలు.. తీర్చలేని సమస్యలు తెర మీదకు వస్తాయాన్న భయాందోళనలకు భిన్నంగా బండి నడుస్తన్న వైనం గురించి ప్రస్తావించాల్సిన అవరం ఎంతైనా ఉంది. అదే సమయంలో.. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం గురించి.. వాటిల్లిన నష్టం గురించి.. సాయం చేసి.. సీమాంధ్రకు అండగా నిలవాల్సిన కేంద్రం అందుకు భిన్నంగా రిక్తహస్తం చూపిస్తున్న వైనం గురించి ప్రత్యేక కథనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ మీడియాలో కనిపించకపోవటం చూస్తే.. అందరిని పట్టించుకునే మీడియా తమను ఏ మాత్రం గుర్తించటం లేదన్న భావన సీమాంధ్రుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన వ్యవస్థల సంగతేమో కానీ.. ఇలాంటి స్పందన మీడియాకు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.