Begin typing your search above and press return to search.

గుజరాత్ లో ఘోరం : కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం .. 18 మంది మృతి !

By:  Tupaki Desk   |   1 May 2021 5:30 AM GMT
గుజరాత్ లో ఘోరం : కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం .. 18 మంది మృతి !
X
దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగిస్తుంటే ... మరోవైపు దేశంలో వరుసగా కరోనా హాస్పిటల్స్ లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భరూచ్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు స్టాఫ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు కాపాడారు. ఓవైపు మంట, మరోవైపు పొగ పెద్ద ఎత్తున రావడంతో పేషెంట్లు ఊపిరి అందక చనిపోయినట్లు బారుచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర సిన్హా చూడసమ తెలిపారు.

ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలోని నాలుగు అంతస్థుల్లో మొత్తం 70 మంది పేషెంట్లు ఉన్నారని అధికారులు చెప్తున్నారు. వారిలో 24 మంది ICU యూనిట్‌ లో ఉన్నారు. స్థానికులు, ఫైర్ సిబ్బంది కలిసి , కాపాడిన పేషెంట్లకు ప్రస్తుతం చుట్టుపక్కల ఆస్పత్రుల్లో ట్రీట్‌ మెంట్ అందిస్తున్నారు. భరుచ్-జంబూసర్ హైవేకు సమీపంలోని ఈ నాలుగు అంతస్తుల ఆస్పత్రిని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిగా మార్చి కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రిని ఓ ట్రస్టు నడుపుతోంది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఘటనపై గుజరాత్ సీఎం విజయ్ రూపాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ అగ్నిప్రమాదం వార్త తెలియగానే దాదాపు 5వేల మంది బారుచ్ ఆస్పత్రికి పరుగన వచ్చారు. వారిలో చాలా మంది రోగుల బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. తమ వారి కోసం వారు అరుపులు, కేకలు పెట్టారు. రాత్రంతా ఆర్తనాదాలే వినిపించాయి. అంతా కన్నీటి విషాదంతో నిండిపోయింది. తరచూ జరుగుతున్న ఇలాంటి అగ్నిప్రమాదాలతో... కరోనా పేషెంట్ల మరణాలు మరింతగా పెరుగుతున్నాయి.