Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కొత్త కోణం

By:  Tupaki Desk   |   2 Nov 2015 3:43 PM IST
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కొత్త కోణం
X
జీహెచ్ ఎంసీ ఎన్నికలను జనవరి 31 లోగా నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం వెనుక వేరే ఉద్దేశం ఉందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన లాజిక్ వింటే అది నిజమేనన్న భావన అందరి నుంచి వ్యక్తమవుతోంది. సీమాంధ్రులు ఓటింగ్ తగ్గించే ఉద్దేశంతోనే ఈ గడువు చెప్పారని... ప్రభుత్వం చెప్పినట్లుగానే జనవరి 31లోపు.. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ఆయన అంటున్నారు. సంక్రాంతి సమయంలో ఎన్నికలు పెడితే సీమాంధ్రుల్లో 90 శాతం వారివారి స్వస్థలాలకు వెళ్తారు కాబట్టి వారి ఓట్లు పడవని.. ఫలితంగా తమకు నష్టం తగ్గుతుందన్నది కేసీఆర్ భావన అని మర్రి అంటున్నారు.

హైదరాబాద్ లో 35 శాతం మంది సీమాంధ్రులు ఓట్లు ఉన్నాయి. సంక్రాంతి వస్తే హైదరాబాద్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. సంక్రాంతికి పది రోజుల ముందునుంచే సీమాంధ్రుల కుటుంబాలు ఏపీ వెళ్లిపోతాయి. జనవరిలో సుమారు 10 నుంచి 20 రోజులు వారు ఇక్కడ ఉండరు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కూడా సెలవులు పెట్టి కుటుంబాలతో సంక్రాంతికి వెళ్తారు. ఆ సమయంలో ఎన్నికలు పెడితే వారు ఓట్లేయలేరు. కేసీఆర్ కు కావాల్సిందీ ఇదే. వారు కనుక ఓట్లేస్తే టీఆరెస్ కు వేసే అవకాశాలు తక్కువ. అలాంటప్పుడు వారు ఓటింగ్ లో పాల్గొనకుండా చేయాలనే కుట్రతోనే ఈ ఎత్తుగడ వేశారని మర్రి అంటున్నారు.