Begin typing your search above and press return to search.

దసరా పండగపై ఎన్నో కథలు.. ఇంతకు ఏది నిజం?

By:  Tupaki Desk   |   23 Oct 2020 6:00 AM IST
దసరా పండగపై ఎన్నో కథలు.. ఇంతకు ఏది నిజం?
X
తెలుగు ప్రజలకు దసరా అతిపెద్ద పండగ.. బంధువులు, మిత్రులు, సకుటుంబసమేతంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఏటా శరదృతువులో అశ్వియుజ శుద్దపాడ్యమి నుంచి దశమి వరకు ఉండే రోజులనే మనం దేవీ నవరాత్రులుగా నిర్వహించుకుంటారు. ఆ తర్వాత దసరా పండుగ చేసుకుంటాం. అమ్మవారి ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్నారు. విజయానికి ప్రతీకగా చేసుకునేది విజయదశమి. దసరా ఎందుకు జరుపుకుంటాం అనే విషయంపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

అరణ్యవాసం విజయవంతం

పాండవులు అరణ్యవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమిని నిర్వహించుకుంటాం అని చెబుతుంటారు పెద్దలు . పాండవులు అజ్ఞాతవాసానికి బయల్దేరే ముందు వారి ఆయుధాలను ఒక శమీ వృక్షంపై పెట్టి వెళ్లారు. ఆయుధాలను కిందకు దింపి అరణ్యవాసం పూర్తయిన తర్వాత విజయదశమి రోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలను కిందకు దింపి పూజలు చేశారు. అలా ఆశ్విజ శుద్ధదశమి విజయదశమిగా మారింది. అలా మహా భారతం ప్రకారం మనం విజయదశమిని జరుపుకుంటాం. అందుకే విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆకుల్ని పెద్దలకు సమర్పించి వారితో ఆశీస్సులు తీసుకుంటాం.

అమ్మవారిని ఎందుకు పూజిస్తామంటే..

పురాణాల్లో వ్యాప్తిలో ఉన్న ఓ కథ ప్రకారం.. దైత్యవంశానికి ‘మహిషాసురుడు’ ఆశాదీపంలా జన్మించాడు. అతడు మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని కోసం ఘోరతపస్సు చేసి పురుషుల చేతిలో చావులేని వరం పొందాడు. బ్రహ్మదేవుని వరంతో మహిషాసురుడు చెలరేగిపోయాడు. దేవలోకంపై దండయాత్ర చేసి ఇంద్రుడిని ఓడించాడు. దేవేంద్రుడు తనను కాపాడాలంటూ త్రిమూర్తులతో మొర పెట్టుకున్నాడు. మహిషాసురుడిపై త్రిముర్తుల్లో క్రోదాగ్ని రగిలింది. ఆ తేజస్సు ఓ స్త్రీరూపమై జన్మించింది. మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది.

మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ రోజునే దసరాగా జరుపుకొంటారనే చెప్పుకుంటారు. దుర్గాదేవికి కూడా విజయదశమి రోజు ప్రత్యేక పూజలు చేస్తాం. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారిని నిష్టగా పూజిస్తాం. ఇక ఎనిమిదో రోజున దుర్గాష్టమిని కూడా ఘనంగా జరుపుతారు.

రావణ వధ
రాముడు వానరసైన్యంతో కలిసి రావణాసురిడిని వధించన రోజు కూడా విజయదశమే. శ్రీ రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజును గర్తు చేసుకుంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో విజయదశమి నిర్వహించుకుంటారు. ఏదీఏమైనా చెడుపై సాధించిన విజయానికి గుర్తుగానే పండుగ చేసుకుంటాం. విజయదశమి రోజు కొత్తగా ప్రారంభిస్తే విజయదశమి రోజు ఏవైనా కొత్తగా ప్రారంభిస్తే జీవితం కచ్చితంగా విజయం చేకూరుతుందనేది ప్రజల నమ్మకం. అలాగే జమ్మి చెట్టుకు కచ్చితంగా పూజలు చేయాలి. అయితే విజయదశమిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు నిర్వహించుకుంటున్నారు.