Begin typing your search above and press return to search.

విజయశాంతి ఇంటికి మాణిక్యం ఠాగూర్

By:  Tupaki Desk   |   5 Nov 2020 10:00 AM IST
విజయశాంతి ఇంటికి మాణిక్యం ఠాగూర్
X
కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్న విజయశాంతిని తిరిగి గాడినపెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయ్యింది. తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన విజయశాంతి ప్రస్తుతానికైతే బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ నిరోధించగలిగింది. ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ గా విజయశాంతి ఉన్నారు. కానీ ఆమె దుబ్బాక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే విజయశాంతి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని.. ఆయన స్థానంలో మరో నాయకుడిని నియమించాలని డిమాండ్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. విజయశాంతిని బీజేపీలో చేరకుండా బుజ్జగించడానికి వచ్చిన నేతల ముందు విజయశాంతి ఈ ప్రతిపాదన పెట్టగా వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారన్న టాక్ ఆ పార్టీలో నడుస్తోంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను అవమానించారని, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తనను ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని రాములమ్మ పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీ ప్రచార కమిటీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ టీపిసిసి ఏ సమావేశానికి తనను ఎప్పుడూ పిలవలేదని ఆమె వారితో చెప్పినట్టు తెలిసింది.

ఈ మేరకు విజయశాంతిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ బుధవారం సాయంత్రం విజయశాంతి ఇంటికి వెళ్లారు. సుధీర్ఘంగా ఆమెతో చర్చించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలను ఠాగూర్ కు విజయశాంతి కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది.

రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా తనను తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని ఠాగూర్ కు విజయశాంతి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.