Begin typing your search above and press return to search.

ఓటేయలేదని పంచిన డబ్బుల వసూలు

By:  Tupaki Desk   |   9 Jun 2019 5:28 PM IST
ఓటేయలేదని పంచిన డబ్బుల వసూలు
X
తెలంగాణలో పరిషత్ ఎన్నికల ఘట్టం పూర్తయ్యింది. జడ్పీటీసీలు - ఎంపీటీసీల విజేతలు ఎవరో తెలిపోయింది. ఎంపీపీలు కొలువుదీరారు. జడ్పీ చైర్మన్ల ఎన్నిక కూడా నిన్ననే ముగిసిపోయింది. టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే ఓడిన ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఇప్పుడు మథనపడుతున్నాయి. తాజాగా తాము పంచిన డబ్బులు పాయే.. అధికారం దక్కకపాయే అని మథనపడుతున్నాయి.

అయితే ఇక్కడో అభ్యర్థి మాత్రం తాను ఎంపీటీసీగా గెలిచేందుకు లక్షలు ఖర్చు చేశానని.. ఓడించిన జనాల నుంచి పంచిన డబ్బులు వసూలు చేస్తుండడం కలకలం రేపుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లెలో ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడే ఇదే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి మందాడి హన్మంతరావు.. గెలుస్తానని లింగయ్యపల్లెలో లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ ఓడిపోయాడు.

దీంతో ఇప్పుడు ఎంపీపీ - జడ్పీ చైర్మన్ల ఘట్టం పూర్తి కావడంతో తన డబ్బును తనకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. జనం కూడా ఓడిపోయిన ఈయనను చూసి సానుభూతితో పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తుండడం విశేషం.

అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం, ఐటీ అధికారులు పరిమితికి మించి ఖర్చు చేశాడని ఈయనపై చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.