Begin typing your search above and press return to search.

నీళ్లు అనుకొని శానిటైజర్ తాగేశాడు..చనిపోయాడు!

By:  Tupaki Desk   |   7 Jun 2020 11:30 PM GMT
నీళ్లు అనుకొని శానిటైజర్ తాగేశాడు..చనిపోయాడు!
X
కంటికి కనిపించని సూక్ష్మజీవి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఎప్పుడు ఎలా అంటుకుందో కూడా తెలీకుండా మనిషి శరీరంలోకి ఎక్కేసే మాయదారి రోగంతో ఇప్పటికే లక్షలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ రోగానికి చెక్ చెప్పేందుకు తరచూ రెండు చేతుల్ని శానిటైజర్ తో శుభ్రం చేసుకోవటం.. మూతికి మాస్కు పెట్టుకోవటం.. భౌతిక దూరాన్ని పాటించటం లాంటివి చేస్తే సరిపోతుంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ముప్పును ఎదుర్కొనే వీలుంది.

బ్యాడ్ లక్ ఏమంటే.. మాయదారి రోగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లే..కొన్ని విషయాల్లో కొందరి తప్పులు వారి ప్రాణాలు తీసే వరకూ వెళుతున్నాయి. తాజాగా చెప్పే ఉదంతం ఆ కోవకే చెందింది. మాయదారి రోగం నుంచి కాపాడే అవకాశం ఉన్న శానిటైజర్ తాజాగా ఒక వ్యక్తి ప్రాణాల్ని తీసింది. విశాఖజిల్లాలోని సత్తిబాబు అనే వ్యక్తి నక్కపల్లి తహసీల్దార్ ఆఫీసులో అటెండర్ గా పని చేస్తున్నాడు.

శనివారం సాయంత్రం ఆఫీసులో ఉన్న వేళ.. విపరీతంగా దాహం వేసింది. దీంతో అక్కడే ఉన్న బాటిల్ ను ఓపెన్ చేసిన అతను.. వెనుకా ముందు చూసుకోకుండా తాగేశాడు. కానీ.. అతడు తాగింది మంచినీళ్లు కాదు.. శానిటైజర్. ఆ తర్వాత కూడా తాను చేసిన తప్పును గుర్తించని అతడు కాసేపటికే అనారోగ్యానికి గురయ్యాడు.

వెంటనే అతడ్ని దగ్గర్లోని ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి పంపారు. అయితే.. అర్థరాత్రి దాటిన తర్వాత వాంతులు.. విరోచనాలు మొదలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా మారటంతో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. మాయదారి రోగం బారిన పడకుండా కాపాడాల్సిన శానిటైజర్.. ఈ ఉదంతంలో ప్రాణం తీసింది.