Begin typing your search above and press return to search.

కోవిడ్​తో మరణం.. ఎన్నికల్లో మాత్రం విజయం.. అమెరికా ఓటర్ల సహృదయం

By:  Tupaki Desk   |   5 Nov 2020 9:00 AM IST
కోవిడ్​తో మరణం.. ఎన్నికల్లో మాత్రం విజయం..  అమెరికా ఓటర్ల సహృదయం
X
అమెరికా ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వస్తున్నాయి. ఉత్కంఠపోరులో ప్రస్తుతం డెమొక్రాట్ల తరఫున పోటీచేసిన జో బిడెన్​ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా నెలకిందట కరోనాతో మృతిచెందిన ఓ అభ్యర్థి ప్రస్తుతం విజయం సాధించడం ఆసక్తి కలిగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహించారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీకి చెందిన డేవిడ్ అంద‌ల్ నార్త్ డ‌కోటాలో పోటీచేశారు. అయితే అక్టోబ‌ర్ 5వ తేదీన కొవిడ్-19 మహమ్మారి బారినపడి మ‌ర‌ణించారు. ఆయన వయసు 55 ఏళ్లు. నార్త్ డకోటాలోని 8వ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన రిపబ్లిక్ అభ్యర్థిగా పోటీ చేశారు.

కరోనా వైరస్ సోకిన డేవిడ్ హాస్పిట‌ల్‌లో 4 రోజుల పాటు పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన మరణించారని తెలిసినప్పటికీ ప్రజలు మాత్రం డేవిడ్​ అందల్​కే ఓట్లేశారు. ఆయన గెలుపొందారన్న వార్త విని డేవిడ్​ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం (నవంబర్ 4) ప్రక‌టించిన ఫ‌లితాల్లో డేవిడ్ విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనకు 35 శాతం ఓట్లు పోలైన‌ట్లు సమాచారం. ప్రజలకు ఎంతో సేవ చేయాలని డేవిడ్ తపించారని ఆయన తల్లి మీడియాతో చెప్పారు. రైతుల‌కు, బొగ్గు ప‌రిశ్రమ కార్మికులకు ఎంతో సేవ చేయాల‌ని భావించినట్లు తెలిపారు. ఎన్నికల్లో డేవిడ్ విజయం సాధించారనే వార్త తెలిసిన తర్వాత ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నార్త్ డ‌కోటా రాష్ట్రంలోకి కరోనా వైరస్ ఆలస్యంగా ప్రవేశించినా.. ప్రస్తుతం అక్కడ కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.