Begin typing your search above and press return to search.

దేశ భ‌క్తి: పాట రాసిన ముఖ్య‌మంత్రి.. భారీ వైర‌ల్‌

By:  Tupaki Desk   |   16 Aug 2021 2:42 AM GMT
దేశ భ‌క్తి:  పాట రాసిన ముఖ్య‌మంత్రి.. భారీ వైర‌ల్‌
X
రాజ‌కీయ ఫైర్ బ్రాండ్‌.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అంటేనే.. మాట‌ల తూటాల పుట్ట‌. నోరు విప్పితే.. బీజేపీపై, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై.. ఆమె వ్యాఖ్య‌ల విల్లుతో మాట‌ల శ‌రాలు సంధిస్తార‌నే విష‌యం తెలిసిందే. అయితే.. అంత రాజ‌కీయ గుండె లోనూ.. ర‌సామృతం ఉంద‌ని నిరూపించుకున్నారు మ‌మ‌తాబెన‌ర్జీ. తాజాగా దేశం 75వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకొంది. అయితే.. దేశంలో ఏ నాయ‌కుడు, ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా మ‌మ‌తా బెన‌ర్జీ త‌న దేశ‌భ‌క్తిని ప్ర‌క‌టించుకున్నారు. త‌నే స్వ‌యంగా ఓ దేశ‌భ‌క్తి గీతాన్ని రాసుకున్నారు. అంతేకాదు.. త‌నే స్వ‌యంగా ట్యూన్ చేసుకుని పాడి దేశ‌ప్ర‌జ‌ల‌కు వినిపించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ఐక్యతను చాటి చెబుతూ దేశభక్తి గీతాన్ని రాశారు. 'దేశ్‌ త సోబర్ నిజర్' (ఈ దేశం మనందరిది) అంటూ సాగే ఈ పాటను బెంగాలీకి చెందిన ఇంద్రనీల్ సేన్, మోనోమోయ్ భట్టాచార్య, త్రిష పరుయ్, దేవజ్యోతి ఘోష్ ఆలపించారు. దీన్ని ఒక వీడియో రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు. దీదీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఇది తెగ వెర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి మ‌మ‌త వంటి రాజ‌కీయ ఫైర్ బ్రాండ్ ఇలా పాట‌రాశారంటే.. ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరోవైపు.. స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మర్చిపోకూడదంటూ మమత ఓ ట్వీట్ చేశారు. "మన స్వేచ్ఛను అణచివేయాలని చూస్తున్న దుష్ట శక్తులను తరిమికొడదాం. అందరం ఐకమత్యంతో కలిసి పోరాడదాం. మనకు స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు`` అని మ‌మ‌త పోస్ట్ చేశారు. ఇదిలావుంటే, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలో ప్రసిద్ధి చెందిన విక్టోరియా మెమోరియల్‌పై 7,500 చదరపు అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు.