Begin typing your search above and press return to search.

కరోనాను క్యాష్ చేసుకోవాలనుకుంటోన్న మాల్యా

By:  Tupaki Desk   |   31 March 2020 12:15 PM GMT
కరోనాను క్యాష్ చేసుకోవాలనుకుంటోన్న మాల్యా
X
కరోనా మహమ్మారి పంజా విసరడం తో భారత్ తో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడి అయిన తర్వాత వ్యవస్థలన్నీ గాడిలో పడడానికి మరో ఏడాది పట్టవచ్చు. దీంతో, ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదని అంతా భావిస్తున్నారు. ఈ అనూహ్య విపత్తు నుంచి గట్టెక్కడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సెలబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు తమవంతు విరాళాలిస్తున్నారు. ఇక, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు...ప్రభుత్వోద్యోగుల జీతాల్లో కోత పెడుతూ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు 'పీఎం కేర్ప్ ఫండ్' పేరుతో విరాళాల సేకరణకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆ ఫండ్ కు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో పాటు పలువురు విరాళాలు కూడా ఇచ్చారు. ఎవరెంత ఇచ్చినా విరాళంగా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, వీరందరికి భిన్నంగా ఓ మాజీ పారిశ్రామికవేత్త మాత్రం....తాను తీసుకున్న అప్పును విరాళంగా ఇస్తానంటూ ముందుకు వస్తున్నాడు. తాను ఎగ్గొట్టిన బకాయిలను చెల్లిస్తానంటూ భారత ప్రభుత్వం కాళ్లా వేళ్లా పడుతున్నాడు. కనీసం కరోనా సాకు తో అయినా తనను కరుణించాలంటూ ప్రాధేయపడుతున్నాడు.

బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయలు పంగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈడీ మాల్యా ఆస్తులను ఎటాచ్ చేయడం తో.... బ్యాంకుల వద్ద తాను తీసుకున్న రుణాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని, తనను వదిలి పెట్టాలని భారత ప్రభుత్వాన్ని చాలా కాలంగా కోరుతున్నాడు మాల్యా. అయితే, ఆ ఆఫర్ ను కేంద్ర ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఇపుడు, తాజాగా కరోనా సాకుగా చూపిన మాల్యా...మరోసారి అప్పు చెల్లిస్తాను మహాప్రభో అంటూ ముందుకు వచ్చాడు. కరోనాతో ఏర్పడిన పాక్షిక ఆర్థిక సంక్షోభ సమయంలోనైనా తన మొర ఆలకించాలని వేడుకుంటున్నాడు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన అప్పులను 100 శాతం తిరిగి చెల్లిస్తానని, తన కోరికను మన్నించాలని అభ్యర్థిస్తూ ట్వీట్ చేశాడు. రుణాలు స్వీకరించేందుకు బ్యాంకులు, ఆస్తుల అటాచ్ మెంట్లను విడుదల చేయడానికి ఈడీ సిద్ధంగా లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. లాక్‌డౌన్ ను గౌరవిస్తున్నానని చెప్పిన మాల్యా.....తాను ఇంటికే పరిమితమయ్యానని...ప్రజలు కూడా అలాగే ఇళ్లకే పరిమితం కావాలని ఉచిత సలహా ఇచ్చాడు. మరి, మాల్యా గోడును ఆర్థిక మంత్రి వింటారో లేదో వేచి చూడాలి.