Begin typing your search above and press return to search.

కెసిఆర్ ని చూస్తే నిజాం నవాబు గుర్తుకొస్తున్నారట

By:  Tupaki Desk   |   2 Jan 2017 2:18 PM GMT
కెసిఆర్ ని చూస్తే నిజాం నవాబు గుర్తుకొస్తున్నారట
X
తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావుపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం నిప్పులు చెరిగారు. కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఆయ‌న పాలనను చూస్తుంటే నిజాం నవాబు గుర్తుకొస్తున్నారని విమ‌ర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ పద్ధతి మార్చుకొని ప్రజానుకూల పాలన కొనసాగించాలని, లేని పక్షంలో గుణపాఠం తప్పదని మ‌ల్లు స్వ‌రాజ్యం హెచ్చరించారు.

హైదరాబాద్‌ లోని ఐద్వా నూతన సంవత్సర బ్రోచర్‌ ను విడుదల చేసిన సంద‌ర్భంగా మ‌ల్లు స్వ‌రాజ్యం మాట్లాడుతూ....ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన కేసీఆర్‌ ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తారని భావించారని అయితే ఆ ఆశ‌ల‌కు కేసీఆర్ వ‌మ్ముచేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యాగాలు చేయడం, దేవున్ని పూజించడం నిజమైతే ఇచ్చిన వాగ్ధానాలు పూర్తిగా అమలు చేయాలని కోరారు. నీళ్లు-నిధులు-నియామకాలు అని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిందని పేర్కొంటూ అయితే ఉద్యోగాలు ఎవరికీ రాలేదని, నీళ్లు ఎక్కడా అందడం లేదన్నారు. భూమి పుత్రులకు కేసీఆర్‌ ద్రోహం చేస్తున్నారని మ‌ల్లు స్వ‌రాజ్యం విమర్శించారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా హైదరాబాద్‌ లో గుంటెడు జాగా లేదని, ఇల్లు లేదని స్వ‌రాజ్యం వాపోయారు. కోట్ల రూపాయ లతో ఇల్లు కట్టుకుని కేసీఆర్‌ రాజభోగాలు అనుభవిస్తున్నారని ప్రజలు మనుషులు కాదా?, వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఎందుకు నిర్మించడం లేదని మ‌ల్లు స్వ‌రాజ్యం ప్రశ్నించారు.

కేసీఆర్‌ సహనం కోల్పోయి కమ్యూనిస్టులపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కమ్యూనిస్టులను అవమానించడమంటే ప్రజలను, రైతులను, కార్మికులను, కూలీలను అవమానించినట్టేనని చెప్పారు. కమ్యూనిస్టులపై తేలికగా మాట్లాడ‌టం సరైంది కాదని ఎవరూ అధికారంలో ఎల్లకాలం ఉండలేరని మ‌ల్లు స్వ‌రాజ్యం తెలిపారు. రైతులను దగా చేసుందుకే తెలంగాణ భూసేకరణ బిల్లు తెచ్చారని విమర్శించారు. ముంపు ప్రజలకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు ప్రజలు అంగీకరించబోరని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/