Begin typing your search above and press return to search.

బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 Aug 2021 3:30 PM GMT
బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
స్వాతంత్ర్య దినోత్సవం రోజున మల్కాజిగిరిలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ పై బీరు బాటిళ్లతో విరుచుకుపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు నుంచి మైనంపల్లి కబ్జాలన్నీ బయటకు తీస్తానంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అదే స్థాయిలో ఘాటు సమాధానమిచ్చారు. రెచ్చగొట్టేలా బండి సంజయ్ వ్యక్తిగత ఆరోపణలు చేశాడని.. అసలు నా గురించి ఏం తెలుసుని మైనంపల్లి మండిపడ్డారు. నా సోషల్ సర్వీస్ ముందు బండి సంజయ్ బతుకెంత అంటూ విరుచుకుపడ్డారు.

ఇంకోసారి మల్కాజిగిరిలో అడుగుపెడితే గుండు పగిలిద్దంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్ ఇచ్చాడు. ఆ గుండుకు దమ్ముంటే తన ముందుకొచ్చి ఆరోపణలు చేయాలని సవాల్ చేశారు. ఈరోజు నుంచి బండి సంజయ్ భరతం పడుతానని.. అతడి బాగోతం అంతా బయటపెడుతానని మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదని.. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు.బండి సంజయ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎంపీకి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు.