Begin typing your search above and press return to search.

మైనంపల్లి.. మళ్లీ ‘బుక్’ అయ్యాడు

By:  Tupaki Desk   |   25 Aug 2021 4:49 AM GMT
మైనంపల్లి.. మళ్లీ ‘బుక్’ అయ్యాడు
X
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో వివాదం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు చిక్కులు తెచ్చిపెట్టింది. తాజాగా ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యే వరకు వెళ్లింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఘర్షణతోనే ఈ వివాదం రాజుకుంది.

మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం సంచలనమైంది. ఈనెల 17వ తేదీన దుల్లాపల్లిలోని మైనంపల్లి ఇంటి దగ్గరికి వెళ్లిన దళిత మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు మైనంపల్లిపై పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై అడగడానికి వెళ్లిన దళిత మహిళలపై దాడి చేసి దుస్తులు చింపినట్లు మైనంపల్లిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దళిత మహిళ జజల రమ్య ఫిర్యాదు మేరకు మైనంపల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆగస్టు 15న జరిగిన ఘర్షణల్లో బీజేపీ కార్పొరేటర్ కు గాయాలయ్యాయి. అక్కడ మొదలైన వివాదం విమర్శలు ప్రతివిమర్శలతో కేసుల వరకూ వెళ్లింది. ఈ వ్యవహారంలో మైనంపల్లి హన్మంతరావు, బండి సంజయ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకూ వెళ్లింది.

ప్రస్తుతం బీజేపీ దళిత కార్యకర్తలు మైనంపల్లి ఇంటికొచ్చి రచ్చ చేయడంతో ఆయన రెచ్చిపోవడంతో ఈ కేసుల వరకూ వెళ్లింది. బీజేపీ కార్యకర్తలు ఇప్పటికీ మైనంపల్లిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన వెంట పడుతున్నారు. మైనంపల్లి కూడా ఎక్కడా తగ్గకుండా బీజేపీ నేతలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వదలకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీని ధీటుగా ఎదుర్కొనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మైనంపల్లికి కొత్త క్రెడిట్ వచ్చేసింది.

-మైనంపల్లి వర్సెస్ బండి సంజయ్ వివాదం ఇదీ

స్వాతంత్ర్య దినోత్సవం రోజున మల్కాజిగిరిలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ పై బీరు బాటిళ్లతో విరుచుకుపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు నుంచి మైనంపల్లి కబ్జాలన్నీ బయటకు తీస్తానంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అదే స్థాయిలో ఘాటు సమాధానమిచ్చారు. రెచ్చగొట్టేలా బండి సంజయ్ వ్యక్తిగత ఆరోపణలు చేశాడని.. అసలు నా గురించి ఏం తెలుసుని మైనంపల్లి మండిపడ్డారు. నా సోషల్ సర్వీస్ ముందు బండి సంజయ్ బతుకెంత అంటూ విరుచుకుపడ్డారు.ఇంకోసారి మల్కాజిగిరిలో అడుగుపెడితే గుండు పగిలిద్దంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్ ఇచ్చాడు. ఆ గుండుకు దమ్ముంటే తన ముందుకొచ్చి ఆరోపణలు చేయాలని సవాల్ చేశారు. ఈరోజు నుంచి బండి సంజయ్ భరతం పడుతానని.. అతడి బాగోతం అంతా బయటపెడుతానని మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదని.. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు.బండి సంజయ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎంపీకి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు.