Begin typing your search above and press return to search.

మోడీకి అసలుసిసలు పరీక్ష స్టార్ట్ అయ్యింది

By:  Tupaki Desk   |   25 Dec 2019 11:31 AM IST
మోడీకి అసలుసిసలు పరీక్ష స్టార్ట్ అయ్యింది
X
కాలం అనువుగా లేనప్పుడు భారీ నిర్ణయాలు తీసుకోవటానికి చాలామంది వెనుకాడుతారు. అందులోకి ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం తాలూకు నిరసనలు.. ఆందోళనలు.. మరోవైపు ఎన్నార్సీ అపోహలత నడుమ కేంద్రప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్న పలు వర్గాలు. ఇవి సరిపోవన్నట్లుగా తాజాగా విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పరివారానికి ఒకటి తర్వాత ఒకటి చొప్పున తలనొప్పులు పెరుగుతున్నాయి.

ఇలాంటివేళ.. ఊహించని రీతిలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రధాని మోడీ. ప్రతికూల పరిస్థితులు చుట్టూ నెలకొని ఉన్న వేళ.. మరో భారీ రిస్క్ కు తెర తీశారు ప్రధాని మోడీ. ఆర్టికల్ 370 నిర్వీర్యం నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో మొహరించిన భారీ బలగాల విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో మొహరించిన 72 కేంద్ర పారా మిలటరీ దళాల్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

ఆర్ఠికల్ 370 నిర్వీర్యం నేపథ్యంలో భద్రతా సమస్యలు పొంచి ఉంటాయన్న సందేహంతో పెద్ద ఎత్తున బలగాల్ని జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా మొహరించారు. ఇలా మొహరించిన బలగాల్లో 72 కేంద్ర పారామిలటరీ దళాల్ని తాజాగా ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఉపసంహరించిన దళాల్లో 24 సీఆర్ఫీఎఫ్ కంపెనీలు.. 12 కంపెనీల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. 12 కంపెనీల ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళం.. 12 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.. మరో 12 కంపెనీల సహస్త్ర సీమాబల్ దళాలు ఉన్నాయి.

జమ్ముకశ్మీర్ లో నెలకొన్న శాంతియుత వాతావరణం నేపథ్యంలో పారామిలటరీ బలగాల్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. నివురు గప్పిన నిప్పులా పరిస్థితులు ఉన్నాయని.. పారామిలటరీ దళాలు ఉపసంహరణ పూర్తి అయిన తర్వాత ఏదో విధంగా జమ్ముకశ్మీర్ అగ్గి రాజుకుంటుందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బలగాల్ని ఉపసంహరించుకునే నిర్ణయాన్ని తీసుకోవటం భారీ రిస్క్ అని అభివర్ణించే వారు లేకపోలేదు. తాజా నిర్ణయం విషమ పరీక్షకు సిద్ధమైనట్లుగా చెప్పక తప్పదు. మరి.. జమ్ముకశ్మీర్ విషయంలో మోడీ సర్కారు అంచనాలు ఎంతమేర నిజమవుతాయో కాలమే చెప్పాలి.