Begin typing your search above and press return to search.

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు: ఆమె కోసం పోలీసుల వేట?

By:  Tupaki Desk   |   28 Jan 2022 4:04 AM GMT
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు: ఆమె కోసం పోలీసుల వేట?
X
సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోని ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ కేసులో ముంబైకి చెందిన హాజహాన్ అనే మహిళ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సిద్దంబర్ బజార్ లో ఈనెల 11న శాన్విక్ ఎంటర్ ప్రైజస్ పేరుతో మహేష్ బ్యాంకులో అకౌంట్ తెరిచింది. నిధుల గోల్ మాల్ అయిన రోజునే షాజహాన్ కు బ్యాంక్ సిబ్బంది కాల్ చేశారు. ఆ ఫోన్ రాగానే షాజహాన్ పరారైంది.

షాజహాన్ అకౌంట్ ద్వారానే సైబర్ క్రిమినల్స్ రూ.6.9 కోట్లు బదిలీ చేశారు. మహేష్ బ్యాంక్ ప్రధాన సర్వర్ నుంచి షాజహాన్ అకౌంట్ కు నిధులు ట్రాన్స్ ఫర్ చేశారు. షాజహాన్ కు సంబంధించిన ఫోన్ ఐడీలు, మెయిల్ అడ్రస్ లను హ్యాకర్లు మార్చలేదు. షాజహాన్ కు హ్యాకర్స్ తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన సర్వర్ పై రష్యా , చైనా నుంచి ఆపరేట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. భారత్ లో హ్యాకర్స్ కి నైజీరియన్లు సపోర్టు చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

మహేష్ బ్యాంక్ పై సైబర్ క్రిమినల్స్ దాడిచేయడం.. బ్యాంక్ సెంట్రల్ సర్వర్ ను హ్యాక్ చేసి రూ.12 కోట్లు కాజేయడం సంచలనం రేపింది. బ్యాంకు సర్వర్ లో లోపమే హ్యాకింగ్ కు ప్రధాన కారణమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హ్యాకింగ్ కు గురైన రూ.12.9 కోట్లు పలు ఖాతాలకు బదిలీ అయ్యాయని.. అందులో రూ.3 కోట్ల వరకూ నిలుపుదల చేశామని చెప్పారు.

కేసు దర్యాప్తులో భాగంగా మహేష్ బ్యాంక్ కు సంబంధించిన మూడు ఖాతాల నుంచి దేశంలోని 120 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజల ఖాతాలతో వ్యవస్థ నడిపినప్పుడు సరైన భద్రత కల్పించడం బ్యాంక్ కనీస బాధ్యత అని.. నిర్లక్ష్యంగా వహించినందుకు బ్యాంకుపైనా కేసు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

బ్యాంకు సొమ్ము దోపిడీ చేసేందుకు రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఇదే బ్యాంకులో మూడు కరెంట్ అకౌంట్లు తెరిచినట్లు చెబుతున్నారు. ముంబైకి చెందిన మహిళల ద్వారా ఈ అకౌంట్లు సైబర్ నేరగాళ్లు తెరిపించారు. ఈ పనికి హుస్సేనీఆలంలోని ఓ వ్యాపారవేత్తను ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ సిద్దంబర్ బజార్, నాగోల్, హుస్సేనీ ఆలంలో ఈ కరెంట్ అకౌంట్లు ఉన్నాయి. ఎలాంటి అనుమానం రాకుండా వ్యక్తుల పేర్లతో కాకుండా సంస్థల పేర్లతో అకౌంట్లను తెరిపించారు సైబర్ నేరగాళ్లు.

గత ఏడాది డిసెంబర్ 23న మహేష్ బ్యాంకులో నిందితులు తొలిసారిగా కరెంట్ అకౌంట్ ఖాతా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. నాగోల్ బ్రాంచ్ లో ఓ కంపెనీ పేరిట ఆ ఖాతా తెరిచినట్లు చెప్పారు. ఆ తర్వాత ఈనెల 11న పాతబస్తీలోని హుస్సేనీ ఆలం బ్రాంచ్ లో హిందుస్తాన్ ట్రేడర్స్ పేరిట ఒక ఖాతాను.. సిద్దంబర్ బజార్ బ్రాంచ్ లో మరో కంపెనీ పేరిట మరో ఖాతాను తెరిచినట్లు తెలిపారు. హుస్సేనీ ఆలంకు చెందిన ఓ వ్యాపారవేత్త సాయంతో ముంబైకి చెందిన మహిళ ద్వారా ఈ ఖాతాలు తెరిపించినట్లు గుర్తించారు.

సూపర్ అడ్మిన్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలను సేకరించడం ద్వారా మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్ ను నిందితులు హ్యాక్ చేశారు. ఇటీవల తెరిచిన మూడు కరెంట్ అకౌంట్ ఖాతాల ద్వారా దాదాపు 12 కోట్ల ను వాటిల్లోకి మళ్లించారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాదిలోని దాదాపు 128 ఖాతాలకు ఆ డబ్బును ట్రాన్స్ ఫర్ చేశారు. ఫ్రాక్సీ అకౌంట్ల ద్వారా ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సుమారు 18 గంటల పాటు హ్యాకర్లు బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసి ఈ తతంగం నడిపినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో షాజహాన్ అనే మహిళ ద్వారా ముందుగా కథ నడిపినట్లు తేలింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.