Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో మృత్యుఘోష ..ఒక్కరోజే 105 మంది !

By:  Tupaki Desk   |   28 May 2020 1:20 PM IST
మహారాష్ట్రలో మృత్యుఘోష ..ఒక్కరోజే 105 మంది !
X
దేశంలో మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంది. దేశంలో మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను పటిష్టంగా అమలుచేస్తున్నప్పటికీ కూడా రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. దీనితో దేశ వ్యాప్తంగా ఆందోళన పెరిగి పోతుంది. ముఖ్యంగా మన దేశంలో మహారాష్ట్రం లో రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే మరణించే వారు సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.

వైరస్ విజృంభణతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. నిన్న(27మే) ఒక్క రోజే ఏకంగా 2190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 964 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 105 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 56,948కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 1,897 మంది మరణించారు.

మహారాష్ట్రలో 37,125 యాక్టిక్ కేసులున్నాయి. ఈ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బుధవారం (27మే) 1044 కొత్త కేసులు నమోదవడంతో పాటు 32 మంది మరణించారు. దాంతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,835కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1097 మంది మరణించారు. ఇకపోతే దేశ వ్యాప్యంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటింది. అలాగే మరణాల సంఖ్య కూడా 4 వేలు దాటిపోయింది.