Begin typing your search above and press return to search.

బీజేపీలో టెన్షన్.. ఒక్క రోజులోనే బల నిరూపణ

By:  Tupaki Desk   |   26 Nov 2019 7:14 AM GMT
బీజేపీలో టెన్షన్.. ఒక్క రోజులోనే బల నిరూపణ
X
బీజేపీ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కరోజులోనే మహారాష్ట్ర లో బలనిరూపణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో బీజేపీకి ఈ పరిణామం విషమ పరీక్షగా మారింది. రేపే డెడ్ లైన్ విధించడంతో మహారాష్ట్ర లో ఫడ్నవీస్ సర్కారు నిలబడుతుందా? పడి పోతుందా అన్న ఉత్కంఠ దేశ వ్యాప్తంగా నెలకొంది.

ఈనెల 27న బుధవారం మహారాష్ట్ర లో గద్దెనెక్కిన ఫడ్నవీస్ సర్కారు బలపరీక్ష చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంటే ఒక్కరోజే గడువు ఉండడంతో బీజేపీ తీవ్ర ఇరకాటంలో పడిపోయింది. 24 గంటలే సమయం ఉండడంతో ఏం చేయాలనేది బీజేపీకి పాలుపోవడం లేదు.

సుప్రీం కోర్టు ఆదేశానుసారం బుధవారం ముందుగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకొని ఆయన ద్వారానే ఉదయం 288 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించి బుధవారం సాయంత్రం బలపరీక్షను మీడియా ప్రత్యక్ష ప్రసారంలో నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. ప్రభుత్వం మహారాష్ట్రలో లేకపోవడంతో ఇప్పుడు గవర్నర్ ఇవన్నీ చేయనున్నారు. సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమించాల్సి ఉంటుంది. బీజేపీలోని సీనియర్ ఎమ్మెల్యేనే ఈ పదవి వరించనుంది. అతడు ఏం చేస్తాడనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒక్కరోజులోనే బలం లేని బీజేపీ ఏం చేస్తుంది.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేస్తుందా? ప్రభుత్వం నిలబడుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు సోమవారం 162 మంది తో బలనిరూపణ ర్యాలీ నిర్వహించి తమకే బలం ఉందని చాటాయి. ఇక బీజేపీకి 105మందితోపాటు ఎన్సీపీ నుంచి వచ్చిన అజిత్ పవార్ వెంట ఎంత మంది వస్తారనేది క్లారిటీ లేదు. దీంతో బీజేపీ ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

ఈనెల 30వతేదీ వరకు ఉండడం తో బీజేపీ నింపాదిగా ప్రొటెం స్పీకర్ ను నియమించి ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక నిర్వహించి ప్రలోభాలతో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని బీజేపీ యోచించింది.కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు కేవలం ఒక్కరోజే గడువు విధించడం తో కమలదళానికి విషమ పరీక్షగా మారింది.

ఇప్పటికే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని బలనిరూపణ చేశాయి. ఇక బీజేపీ తమకు 170మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వాదిస్తోంది. దీంతో రేపు ఎవరి బలం ఏంటనేది తేలనుంది.