Begin typing your search above and press return to search.

కొత్త కోరిక: పర్వతాల మధ్యలో పెళ్లి!

By:  Tupaki Desk   |   2 Aug 2016 5:30 AM GMT
కొత్త కోరిక: పర్వతాల మధ్యలో పెళ్లి!
X
పెళ్లి... ప్రతీ మనిషి జీవితంలోనూ ఒక అద్భుతమైన ఘట్టం. ఈ విషయంలో ఎవరి కలలు వారికి ఉంటాయి.. దీంతో వారి వారి ఆర్ధిక పరిస్థితికి తగినట్లుగా ఈ వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా ప్లాన్ చేసుకుంటారు. సంపన్నుల పెళ్లిల్లు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక మధ్యతరగతి / సామాన్యులు అయితే ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు. ఇక డబ్బుకీ, స్థాయికీ సంబందం లేకుండా కొందరు మాత్రం అందరికంటే భిన్నంగా తమ పెళ్లి జరగాలనుకుంటారు. ఇలా ఆలోచించే కొందరు సముద్రం అడుగుభాగాన్న చేసుకుంటే, మరి కొందరు పారాచూట్ల సాయంతో గాళ్లో ఎగురుతూ చేసుకుంటారు. ఇలా వారి వారి అభిరుచులకు తగ్గట్లు వారు ప్లాన్ చేసుకుంటారు. ఇదే విషయంలో మహారాష్ట్రలోని ఒక జంట కూడా వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు.

మహారాష్ట్ర కొల్లపూర్ కు చెందిన పర్వతారోహకుడు జైదీప్ గునాజీరావ్ జాదవ్ - రేష్మ లు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే అది కళ్యాణ మండపంలోనూ - ఇంటివద్దో లేక గుడిలోనో కాదు.. భూమికీ - ఆకాశానికి మధ్య జరుపుకోవాలని అనుకున్నారు. వీరిద్ధరూ పర్వతారోహణ ఔత్సాహికులు కావడంతో అనుకున్నట్లుగానే వీరి వివాహాన్ని పర్వత ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. భూమికి సుమారు వెయ్యి అడుగుల ఎత్తులోఉన్న పర్వతాల మధ్య ఒక రోప్ వే పై పెళ్లిచేసుకున్నారు.

వివాహ దుస్తుల్లో ఉన్న వీరిద్ధరూ పర్వతాల మధ్య తాళ్లతో వేలాడుతూ ఉండగా.. తాడుపై నిలబడిన పూజారి వివాహతంతు ముగించాడు. వారిలా సాహసం చేయలేని కుటుంబ సభ్యులు - బంధుమిత్రులు మాత్రం సమీపంలోని పర్వతం అంచుపై నిల్చుని వారిని ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన వారు, పూజారి కాస్త ఇబ్బందిపడినా.. తాము అనుకున్నట్లు పెళ్లి చేసుకోవడంతో ఈ కొత్త జంట ఫుల్ ఖుషీ గా ఉన్నారు!