Begin typing your search above and press return to search.

తెదేపాను వీడనున్న మరో ఎమ్మెల్సీ మాగుంట!

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:18 PM GMT
తెదేపాను వీడనున్న మరో ఎమ్మెల్సీ మాగుంట!
X
ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీల గండం ఉండేది. అది కాస్తా ఇప్పుడు ఎమ్మెల్సీల గండంగా మారిపోయిందని సర్వత్రా చర్చ నడుస్తోంది. కొందరు ఎమ్మెల్సీల వల్ల పార్టీ పరువు పోయే పరిస్థితి.. అలాగే మొన్నటికి మొన్న శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడిపోవడం దీనికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు పదవి కట్టబెట్టిన మరో ఎమ్మెల్సీ కూడా పార్టీని వీడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు, మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైకాపా తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్వతహాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆ పార్టీ తరఫునే గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో సరిగ్గా ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరి.. ఎంపీగా బరిలోకి దిగారు. అయినా ఫలితం దక్కలేదు. వైకాపా చేతిలో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత.. కొన్నాళ్లకు ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. నిజానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంత్రి పదవిని కూడా ఆశించినప్పటికీ రకరకాల కాంబినేషన్ల నేపథ్యంలో కుదర్లేదు.

మొత్తానికి చాన్నాళ్లుగా మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం అధినాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఆయన పార్టీని వీడబోతున్నట్లుగా, కొంత కాలం నుంచి వైకాపా లో చేరడానికి ఆ పార్టీ పెద్దలతో రాయబారాలు నడుపుతున్నట్లుగా కూడా ఒక తెలుగు న్యూస్ ఛానెల్ ఓ కథనాన్ని అందించింది.

మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా పార్టీని వీడి, వైకాపాలోకి పోతే గనుక.. తెదేపా కు ప్రకాశం జిల్లాలో పెద్ద దెబ్బే అనుకోవాలి. కేవలం సామాజిక వర్గ సమీకరణాల పరంగా మాత్రమే కాకుండా.. జిల్లాకు బాధ్యత తీసుకోగల కాస్త సీనియర్ ను కోల్పోయినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు.