Begin typing your search above and press return to search.

బాబు స‌భ‌లో మైక్ విసిరికొట్టిన టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   14 April 2016 6:08 AM GMT
బాబు స‌భ‌లో మైక్ విసిరికొట్టిన టీడీపీ ఎంపీ
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సాక్షిగానే ఓ టీడీపీ ఎంపీ కోపం ప‌ట్ట‌లేక మైక్ విసిరికొట్టాడు. చంద్ర‌బాబు పోలవరం ముంపు మండలాల పర్యటనలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కుక్కునూరులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ ప్రారంభ‌మ‌య్యేందుకు ముందుగా వేదిక వ‌ద్ద‌కు ఏలూరు ఎంపీ మాగంటి బాబు అనుచ‌రులైన ప‌లువురు ఎంపీపీలు - జ‌డ్పీటీసీలు - ఎంపీటీసీలు వ‌చ్చారు. వీరిని వేదిక మీద‌కు ఎక్కేందుకు పోలీసులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో మాగంటి పోలీసుల‌పై ఫైర్ అయ్యారు.

చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో మాగంటి చాలా ఉత్సాహంగా హ‌ల్‌ చ‌ల్ చేశారు. బాబు త‌న అనుచ‌రుల‌తో ముందుగానే స్టేజ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అయితే బాబు అనుచ‌రులు వేదిక ఎక్కేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో మాగంటి వారిని వేదిక మీదకు అనుమతించాలని పదే పదే పోలీసులకు సూచించారు. అయితే పోలీసులు మాగంటి మాట‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోకుండా స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ప‌క్క‌కు నెట్టేశారు.

దీంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురైన మాగంటి తన చేతిలోని మైకును నేలకేసి విసిరికొట్టారు. ఆ తర్వాత ఎంపీనైన తనకే విలువ ఇవ్వనప్పుడు తాను అక్క‌డ ఎందుకు ఉండాలంటూ ఆయ‌న విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత 15 నిమిషాలకు చంద్రబాబు అక్కడికి చేరుకున్నా, మాగంటి మాత్రం తిరిగి రాలేదు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ప‌లించ‌లేదు.