Begin typing your search above and press return to search.

అధికార పార్టీ నేత ఆవేద‌న‌...నేను ఎంపీ నేనా?

By:  Tupaki Desk   |   1 Jan 2017 8:02 AM GMT
అధికార పార్టీ నేత ఆవేద‌న‌...నేను ఎంపీ నేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీలో నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు కాంక్రీట్ ప‌నులను ఏపీ ప్ర‌భుత్వం అట్ట‌హాసంగా చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌మ‌యంలో త‌న‌కు తీవ్రంగా అవ‌మానం జ‌రిగింద‌ని బాబు వాపోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ "నేను అధికార పార్టీ త‌ర‌ఫున ఎంపికైన ప్ర‌జా ప్ర‌తినిధిని. అయితే సీఎం చంద్ర‌బాబు పర్యటనలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఏ కార్యక్రమంలోనూ ప్రొటోకాల్‌ పాటించకుండా ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారు. అసలు నేను ఎంపీనేనా?" అని మాగంటి బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు వడివడిగా ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉందని హ‌ర్షం వ్య‌క్తం చేసిన మాగంటి బాబు ఈ సంద‌ర్భంగా త‌న‌కు ద‌క్కుతున్న గౌర‌వంపై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కాంక్రీట్‌ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నా కార్యాలయానికి ఒక కార్డు పంపించేసి మమ అన్పించారు అంటూ బాబు వాపోయారు. సీఎం చంద్ర‌బాబు రాక సందర్భంగా పత్రికల్లో ఇచ్చిన యాడ్స్‌లోనూ స్థానిక ఎంపీ అయిన తన ఫొటో లేకుండా చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ త‌మ పార్టీ కార్య‌క్ర‌మం అనుకోని భావించి అక్క‌డికి హాజ‌రైతే...సభ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. త‌ను ఎంపీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో, త‌మ పార్టీకి చెందిన నాయ‌కుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ఇలాంటి ప‌రిణామం చోటుచేసుకోవ‌డం బాధాక‌రంగా ఉంద‌ని మాగంటి బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గౌర‌వ మ‌ర్యాద‌ల ప‌రంగా చూస్తే ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌న్నీ త‌న‌ను తీవ్రంగా క‌లిసివేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/