Begin typing your search above and press return to search.

జ్యోతిరాదిత్య సింథియా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్న ప్రభుత్వం

By:  Tupaki Desk   |   10 March 2020 8:20 AM GMT
జ్యోతిరాదిత్య సింథియా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్న ప్రభుత్వం
X
మధ్యప్రదేశ్ లో ఊహించనట్టే పరిణామాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి మధ్యప్రదేశ్ అధికార పీఠంపై కన్నేసిన బీజేపీ ఆ మేరకు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విబేధాలు ఉన్నాయి. అసంతృప్తులు భారీగా ఉన్నాయి. ఇవి బహిరంగంగా వెల్లడవుతున్నా కాంగ్రెస్ అధిష్టానం పరిష్కరించడానికి చర్యలు తీసుకోలేదు. దీంతో విబేధాలు, అసంతృప్తులే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కోల్పోయే పరిస్థితికి దారితీస్తోంది. విబేధాలు, అసంతృప్తులను బీజేపీ పావుగా వాడుకుని ఇప్పుడు మధ్యప్రదేశ్ లో రాజకీయం చేస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో దశాబ్దానికి పైగా ఉన్న యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ స్వయం తప్పిదాలే ఈ పరిణామాలకు కారణం.

ముఖ్యమంత్రి కమల్ నాథ్, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా మధ్య ఎన్నికల నాటి నుంచి విబేధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా తనను కాదని కమల్ నాథ్ ను ఎంపిక చేయడంతో జ్యోతిరాదిత్య సింథియా అసంతృప్తి చెందాడు. అప్పట్లోనే పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచన లో ఉన్నాడు. కాకపోతే కొంత సర్దుబాటు చేయడంతో సింథియా మెత్తబడ్డాడు. అయితే అసంతృప్తి, విబేధాలు మాత్రం తగ్గకపోగా తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకెన్నాళ్లు అని సింథియా భావించి తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరు లో శిబిరం పెట్టేశాడు. దీంతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.

అయితే జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నాడని, త్వరలోనే వస్తారని కాంగ్రెస్ నాయకులు చెబుతుండగా వారికి షాకిచ్చేలా సింథియా నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా పార్టీకి రాజీనామా చేశాడు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. అంతకుముందు సింథియా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎట్టకేలకు గుడ్‌‍బై చేశారు.

18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని ఆవేదన చెందుతూనే రాజీనామా చేశారు. రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరిక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నట్లు లేఖలో వాపోయారు. ప్రజల, పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. ఇంతవరకూ తనకు సహకరించిన పార్టీ సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలని లేఖలో వెల్లడించారు.

సింథియా రాజీనామాతో కమల్ నాథ్ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడింది. ఇక కాంగ్రెస్ అధికారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సింథియా తన మద్దతుదారులైన 20మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. బీజేపీలో చేరి వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో కలిసి వ్యూహం రచించే అవకాశం ఉంది. తాజా లెక్కల ప్రకారం సింధియాతో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలను కలిపేసుకుని బీజేపీ తన 107 స్థానాలతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో అధికారం రావాలంటే 116 స్థానాలు ఉండాలి. సింథియా ఎమ్మెల్యేలు 20మంది కలిస్తే 107 ఉన్న బీజేపీ బలం 127 అవుతుంది. దీంతో అధికారం సునాయాసమవుతుంది. అదే బీజేపీ, సింథియా వ్యూహం. ఇక త్వరలోనే మధ్యప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. తిరిగి బీజేపీ మధ్యప్రదేశ్ లో అధికారం చేపట్టనుంది.


అయితే మధ్యప్రదేశ్ లో బలాబలాలు ఇలా ఉన్నాయి.
మొత్తం స్థానాలు 230
కాంగ్రెస్ 114
బీజేపీ 107
స్వతంత్రులు 4
ఎస్పీ 1, బీఎస్పీ 2
రెండు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు 116 స్థానాలు కావాల్సి ఉండగా ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రులతో కలిపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం బలం 121