Begin typing your search above and press return to search.

ఈవీఎం పగలకొట్టిన జనసేన అభ్యర్థి

By:  Tupaki Desk   |   11 April 2019 6:04 AM GMT
ఈవీఎం పగలకొట్టిన జనసేన అభ్యర్థి
X
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొదటి గంటలోనే ఊహించని పరిణామం ఒకటి ఏపీలో చోటుచేసుకుంది. జనసేన అభ్యర్థి ఒకరు ఆగ్రహంతో ఈవీఎంను పగులగొట్టిన వైనం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఎందుకని ఆ పని చేశారన్న విషయంలోకి వెళితే..

అనంతపురం జిల్లా గుంతకల్ (గుత్తి) నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న మధుసూదన్ గుప్తా ఊహించని రీతిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుత్తి బాలికోన్నత పాఠశాల 183వ పోలింగ్ బూత్ లో తన ఓటుహక్కును వినియోగించుకోవటానికి వచ్చారు.

ఓటింగ్ ఛాంబర్ లో అసెంబ్లీ.. పార్లమెంటు అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ది చెప్పటానికి అధికారులు ప్రయత్నించినా ఆయన మాట వినలేదు సరి కదా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోపంలో అక్కడున్న ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు. దీంతో.. ఈవీఎం పగిలిపోయింది. దీంతో.. ఆయన్ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎంత కోపమైతే మాత్రం అభ్యర్థే ఈవీఎం పగలకొడితే ఎలా?