Begin typing your search above and press return to search.

దారుణంగా ఓడిపోతూ.. ఇలాంటి చమత్కారాలు పనబాకకే చెల్లు

By:  Tupaki Desk   |   2 May 2021 7:48 AM GMT
దారుణంగా ఓడిపోతూ.. ఇలాంటి చమత్కారాలు పనబాకకే చెల్లు
X
కిందపడ్డా నాదే పైచేయి అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. మరీ.. అలాంటి సామెతతో పోల్చలేం కానీ.. ఇంచుమించు అలాంటి తీరునే ప్రదర్శించారు సీనియర్ నేత.. తిరుపతి ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పనబాక లక్ష్మీ. నామినేషన్ సమయంలోనే ఆమె పరాజయం పక్కా అని తేలిపోయింది. అధినేత చంద్రబాబు మాట కాదనలేక ఆమె బరిలోకి దిగారు. అన్యమనస్కంగానే ఆమె బరిలో ఉన్నట్లుగా వ్యాఖ్యలు వినిపించాయి. దీనికి తగ్గట్లే ఆమె ప్రచారం సాదాసీదాగా సాగింది. దీంతో.. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి.. తీవ్రమైన నిరాశలో కూరుకున్న పార్టీ శ్రేణుల్ని తన పర్యటనతో ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారని చెప్పాలి.

ముందుగా వెలువడిన అంచనాలకు తగ్గట్లే.. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ఫలితం వెలువడుతోంది. ఉప ఎన్నిక కౌంటింగ్ మొదటి రౌండ్ ముగిసేసరికి.. అధిక్యతలో వెనుకబడిన ఆమె ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లుగా ప్రచారం సాగింది. దీనికి సంబంధించి ప్రముఖ చానళ్లలోనూ బ్రేకింగ్ న్యూస్ కింద వేశాయి. అయితే..అదంతా తప్పుడు ప్రచారంగా కాసేపటికి కానీ తేల్లేదు. ఎందుకంటే.. ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ఆమె ఉన్నారు.

తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూసినప్పుడు భారీ మెజార్టీ దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళుతున్నారు. మొదటి రౌండ్ నుంచి అధిక్యంలో సాగుతున్న అతగాడు.. రౌండ్.. రౌండ్ కు మెజార్టీ పెంచుకుంటూ వెళుతున్నారు. అయితే.. తాను మొదటి రౌండ్ ఫలితం వెల్లడైన వెంటనే కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.

ఈ సందర్భంగా ఆమె అనూహ్యమైన చమత్కారాన్ని ప్రదర్శించారు. వైసీపీ విజయాన్నితక్కువ చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని.. అసలు ఫలితం తెలిసి కూడా తమాషా చూద్దామని తాను కూర్చొని ఉన్నానని.. జరగాల్సినవన్నీ ముందు జరిగిన తర్వాత ఇప్పుడేం జరిగేదేముంటుందని ఆమె వ్యాఖ్యానించారు. తనకు ఎదురైన దారుణ ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా.. ఇలాంటి చమత్కారాలతో పనబాక తన తెలివిని ప్రదర్శిస్తున్నారని వైసీపీనేతలు ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 90వేలకు పైనే అధిక్యంలో వైసీపీ అభ్యర్థి ఉన్నారు.