Begin typing your search above and press return to search.

స్పై వేర్ పెగాసస్ కోసం ఆరాటం

By:  Tupaki Desk   |   24 July 2021 1:30 AM GMT
స్పై వేర్ పెగాసస్ కోసం ఆరాటం
X
పెగాసస్.. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న నిఘా సాఫ్ట్ వేర్ ఇదీ.. ఈ సాఫ్ట్ వేర్ తో జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, సుప్రీంకోర్టు జడ్జీల ఫోన్ నంబర్లు కూడా హ్యాక్ చేసి వారి సీక్రెట్ అంతా తెలుసుకున్నారని అంతర్జాతీయ పత్రికలు బయటపెట్టడంతో పెద్ద దుమారం రేగింది. ఇది మనం ఎవరి ఫోన్ అయితే టార్గెట్ చేశామో వారి ఫోన్ లోకి సులభంగా చొరబడి నిఘా పెడుతుంది. స్పైవేర్ ద్వారా హ్యాకర్లు దేశంలోని ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని 'దివైర్' ఆదివారం ఓ కథనం ప్రచురించి సంచలనం సృష్టించింది.

ఇజ్రాయెల్ కు చెందిన ఎస్ఎస్ఓ అనే సంస్థ తయారు చేసిన స్పైవేర్ టూల్ 'పెగాసస్'. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే ఈ పెగాసస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఫోన్లు ఉన్న వినియోగదారులకు ఒక లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆ యూజర్ ఫోన్ పూర్తిగా ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో వారి స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. యూజర్ కు తెలియకుండానే ఆ టూల్ అతడి ఫోన్ లో ఇన్ స్టాల్ అవుతుంది. ఒక సారి ఇన్ స్టాల్ అయ్యాక ఫోన్ కు సంబంధించిన డేటానంతా ఎటాకర్ కు పంపించడం మొదలుపెడుతుంది. వ్యక్తిగత డేటాతోపాటు పాస్ వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్ తోపాటు లైవ్ వాయిస్ కాల్స్ ను కూడా ఇది ట్రాక్ చేస్తుంది.ఆఖరికి యూజర్ కు తెలియకుండా అతడి ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్ ను కూడా ఆన్ చేసి విని, చూడగలిగే సామత్యం హ్యాకర్ కు ఉంటుంది. ఇప్పుడు ఒక మిస్డ్ వీడియో కాల్ చేసి కూడా ఫోన్ ను ఈ కొత్త 'పెగాసస్' సాఫ్ట్ వేర్ హ్యాక్ చేస్తోందని 'వాట్సాప్' ఆరోపించింది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో దాదాపు 20 దేశాల్లో దాదాపు 1400 మందికి పైగా పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని వాట్సాప్ సంచలన ఆరోపణలు చేసినట్టు విదేశీ మీడియా తెలిపింది. ఇప్పటికే పెగాసస్ పై వాట్సాప్ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా కూడా వేసింది.

ఇప్పుడు ఇదే ఇజ్రాయలీ పెగాసస్ సంస్థ భారత్ లో నిఘాకు వినియోగించారన్న వార్తలు బయటకు రావడంతో పెను సంచలనమైంది. దీన్ని కేంద్రం చేసిందా? లేక దీనివెనుక ఎవరున్నారన్నది నిగ్గుతేలాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద స్థాయిలో ఇంతపెద్ద ప్రముఖులపై 2019 సార్వత్రిక ఎన్నికల వేళ సాగిన ఈ తంతు ఇప్పుడు దేశాన్ని కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ కు చెందిన ఈ సాఫ్ట్ వేర్ కేవలం దేశాలు మాత్రమే వినియోగిస్తాయి. ఎక్కడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఈ సాఫ్ట్ వేర్ యాక్సెస్ లేదు. అయితే జనాలకు మాత్రం ఈ యాప్ మీద క్రేజ్ పెరిగిపోయింది. సహజంగానే ఎదుటివారి ఫోన్ లో చొరబడి వారి జీవితాలలోకి తొంగిచూసే అలవాటు జనాలకు ఎక్కువ. ఆ మనస్తత్వం ఉన్న వారంతా ఈ యాప్ కోసం ప్లే స్టోర్ లాంటి వాటిలో తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ప్లే స్టోర్ లోనే పెగాసస్ పేరుతో ఓ యాప్ దొరడంతో దాన్ని డౌన్ లోడ్ చేస్తున్నారు.

అయితే ఇది స్పైవేర్ యాప్ కాదని తర్వాత తెలిసింది. అది కేరళ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెటీరియల్ కనిపిస్తోంది. దీంతో దాని టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి పనిచేయడం లేదని మొత్తుకుంటున్నారట..

నిజానికి ప్లే స్టోర్ లోని పెగాసస్ పేరు కేరళలోని కోజికోడ్ లోని సివిల్స్ కోచింగ్ సెంటర్ యాప్ అది. ఇజ్రాయెల్ స్పైవేర్ కాదు.. దీంతో ఇజ్రాయెల్ సాఫ్ట్ వేర్ యాప్ గొడవ కేరళ కోచింగ్ సెంటర్ కు ఇబ్బందిగా మారిందట...