Begin typing your search above and press return to search.

87 నగరాల్లో లాక్ డౌన్.. కంపెనీలు మూత!

By:  Tupaki Desk   |   16 April 2022 9:34 AM GMT
87 నగరాల్లో లాక్ డౌన్.. కంపెనీలు మూత!
X
చైనాలో కరోనా మరో సారి విజృంభిస్తోంది. కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. గవేకాల్ డ్రొగొనామిక్స్ అధ్యయనం ప్రకారం.. చైనాలోని 100 ప్రధాన నగరాల్లోని 87 నగరాల్లో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. సుమారు 40 కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా షాంఘై నగరంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు అవుతున్నాయి.

3 వారాలుగా అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆహారం దొరక్క డ్రాగన్ దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు షాంఘైలో కఠినమైన ఆంక్షలు అమలు అవుతుండటంతో పాటు కంపెనీలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. దీంతో తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అంతే కాక కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో అపార్ట్ మెంట్స్ లో ఇళ్లను క్వారంటైన్ లా మార్చెందుకు పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానిక ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులపై దాడులకు సైతం స్థానిక ప్రజలు వెనుకాడటం లేదు. కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో షాంఘైలోనే కాకుండా కున్ షాన్, షాన్ షీ ప్రావిన్సు రాజధాని తైయువాన్, గువాన్ ఝౌ.

టాంగ్ షాన్, లాంగ్ ఫాంగ్ తో పాటు పలు నగరాల్లో కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు అవుతున్న నేపథ్యంలో చైనాలోని దిగ్గజ కంపెనీలు మూత పడుతున్నాయి. ఐఫోన్ తయారీ దారు పెగాట్రాన్ కార్పొరేషన్ వంటి సంస్థలతో పాటు టెస్లా, నియో వంటి కార్ల తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి.

మరికొన్ని రోజులు కొవిడ్ ఆంక్షలు ఇలాగే కొనసాగితే వచ్చే నెలలో చైనా ఆటో మేరక్స్ ఉత్పత్తి నిలిపివేయాల్సి ఉంటుందని వాహన తయారీ సంస్థలు చెబుతున్నాయి. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ అది ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని సంస్థలు అధికారుల దృష్టికి తెస్తున్నాయి.

మరో వైపు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కరోనా జీరో లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కఠిన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పలు నివేదికలు చెబుతున్నప్పటికీ కరోనా జీరో విధానానికే తాము కట్టుబడి ఉన్నామని జిన్ పింగ్ స్పష్టం చేశారు. అయితే ప్రజలు మాత్రం పలు ప్రాంతాల్లో ఆహారం దొరక్క తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.