Begin typing your search above and press return to search.

మద్యం ధరలు తగ్గించాక ఏపీ ఖజానాకు కాసుల కళకళ

By:  Tupaki Desk   |   5 Nov 2020 10:15 AM IST
మద్యం ధరలు తగ్గించాక ఏపీ ఖజానాకు కాసుల కళకళ
X
వినేందుకు.. చెప్పేందుకు ఆదర్శాలు బాగానే ఉంటాయి. చేతల్లోకి వచ్చేసరికి వాటి కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్నికావు. మద్యనిషేధానికి ఊతమిచ్చేలా.. ప్రజల్లో మద్యం తాగాలన్న ఆలోచనను తగ్గించేందుకు వీలుగా ధరల్ని భారీగా పెంచేయాలన్న ఏపీ సర్కారు నిర్ణయం వర్కువుట్ కాకపోవటం తెలిసిందే. మంచికి పోతే చెడు ఎదురైనట్లు..మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయం కన్నా.. ప్రజల్లో మార్పు కోసం ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం.. కొత్త సమస్యలకు తెర తీసిన వైనం తెలిసిందే.

ధరల్ని భారీగా పెంచటంతో.. ఏపీకి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకురావటం ఎక్కువ కావటమే కాదు.. సరిహద్దు ప్రాంతాల్ని దాటి..మద్యాన్ని సేవించి వస్తున్న ఉదంతాలు ఎక్కువ అయ్యాయి. ధరల పెంపుతో కొత్త సమస్యలు ఎదురుకావటం ఒకటైతే.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో.. ధరల్ని భారీగా తగ్గిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

అక్టోబరులో తీసుకున్న నిర్ణయంతో పరిస్థితుల్లో చాలానే మార్పులు వచ్చాయని చెప్పాలి. గడిచిన 22 రోజుల్లో ఖజానాకు మద్యం అమ్మకాలతో వచ్చిన పన్ను ఆదాయం ఏకంగా రూ.1700 కోట్లు కావటం గమనార్హం. రెగ్యులర్ గా వచ్చే ఆదాయం కంటే.. ధరల తగ్గింపుతో రూ.200 కోట్లు అదనంగా రావటం గమనార్హం. మంచికిపోతే చెడు ఎదురుకావటం.. ధరల్ని తగ్గించిన వెంటనే ఆదాయం భారీగా పెరగటం చూస్తే.. రానున్న రోజుల్లో మద్యం ధరల్ని తక్కువగా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.

కరోనా కారణంగా రాష్ట్రానికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయం అక్కరకు వచ్చేలా మారిందని చెప్పాలి. మద్యం ధరల తగ్గింపు నిర్ణయం మొదటే అమలు చేసి ఉంటే.. ప్రస్తుత పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.