Begin typing your search above and press return to search.

ఆ గుడ్ న్యూస్ మనకెపుడు..లిక్కర్ డోర్ డెలివరి అట!

By:  Tupaki Desk   |   8 April 2020 5:06 PM GMT
ఆ గుడ్ న్యూస్ మనకెపుడు..లిక్కర్ డోర్ డెలివరి అట!
X
చూస్తుంటే... మందు బాబులకు పశ్చిమ బెంగాల్ లో తీపి కబురే వినిపించేలా ఉంది. కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండగా... మిగిలిన అన్ని రంగాల మాదిరే లిక్కర్ విక్రయాలు కూడా పూర్తిగా బంద్ అయిపోయాయి. అయితే మందు లేనిదే నిద్ర పట్టని మందు బాబులు మాత్రం మద్యం షాపులు తెరవకున్నా ఫరవా లేదు.. కనీసం ఆన్ లైన్ లో అయినా లిక్కర్ సేల్స్ కు అనుమతి ఇవ్వాలని - మద్యాన్ని హోం డెలివరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓకే చెప్పేసినట్లుగా వినిపిస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

లాక్‌ డౌన్‌ సమయంలో రాష్ట్రంలో మద్యం హోమ్‌ డెలివరీకి అనుమతించాలని దీదీ నిర్ణయం తీసకున్నట్టు బెంగాల్ ఎక్సైజ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే లాక్‌ డౌన్‌ వల్ల మూతపడ్డ మద్యం షాపులను ఎట్టి పరిస్థితుల్లో తెరిచేది లేదని చెబుతున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు... ఆన్‌ లైన్‌ లో ఆర్డర్‌ చేసుకున్నవారికి మాత్రం మద్యం షాపుల నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు చెప్పారు. అంటే... మద్యం కోసం బెంగాల్ మందుబాబులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్న మాట. ఇంటిలో కూర్చుని ఆన్ లైన్ లో మద్యం కోసం ఆర్డర్ ఇస్తే... వారి ఇంటికే నేరుగా మద్యం వచ్చి చేరుతుందన్న మాట. ఇందుకోసం దీదీ సర్కారు పకడ్బందీ ప్రణాళిక కూడా రూపొందించినట్టు సమాచారం.

"మద్యం విక్రేతలకు స్థానిక పోలీసుల స్టేషన్‌ లలో హోం డెలివరీకి సంబంధించిన పాస్‌ లు జారీ చేయనున్నాం. ఇందుకోసం మద్యం షాప్‌ యజమానులు స్థానిక పోలీసులను సంప్రదించాలి. ఒక్క షాపుకు మూడు డెలివరీ పాస్‌ లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో వారి ఫోన్ల ద్వారా మద్యం కొనుగోలుకు ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం"అని ఎక్సైజ్‌ శాఖ తన ప్రణాళికను వివరించింది. చూద్దాం మరి... ఈ తరహా సేల్స్ ను దీదీ సర్కారు ఎప్పటినుంచి అమలు చేస్తుందో చూడాలి.