Begin typing your search above and press return to search.

నోటీసులకు స్పందించని లింగమనేని!

By:  Tupaki Desk   |   4 July 2019 8:00 PM IST
నోటీసులకు స్పందించని లింగమనేని!
X
కరకట్టపై అక్రమ నిర్మాణాల విషయంలో జారీ అయిన నోటీసులుకు సదరు నిర్మాణాలకు యజమానులుగా చలామణి అవుతున్న వారు స్పందించడం లేదని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో నిర్మించిన ‘ప్రజావేదిక’ను ప్రభుత్వం కూల్చేసిన అనంతరం ఇతర అక్రమ నిర్మాణాలకు కూడా నోటీసలు జారీ అయ్యాయి. దాదాపు ఇరవై ఆరు నిర్మాణాలకు అలాంటి నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది.

సీఆర్డీయే తరఫు నుంచి ఆ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆ నోటీసులు వారు సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది. నోటీసులు అందుకున్న అనంతరం స్పందించింది నలుగురు ఐదుగురే అని సమాచారం. ప్రత్యేకించి లింగమనేని కూడా స్పందించ లేదని తెలుస్తోంది. లింగమనేని ప్రస్తావన ప్రత్యేకంగా ఎందుకో చెప్పనక్కర్లేదు. ఆయన నిర్మించిన గెస్ట్ హౌస్ లోనే చంద్రబాబు నాయుడు మకాం పెట్టారు. ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అందులోనే నివసించారు. ఇప్పటికీ అందులోనే ఉంటున్నారు. అది అక్రమ కట్టడం అని ప్రభుత్వం తేల్చింది.

దానికి గతంలోనే పర్యావరణ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. అయితే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు దాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ నేఫథ్యంలో ఏపీ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ లింగమనేని మాత్రం రియాక్ట్ కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారింది.