Begin typing your search above and press return to search.

ఉద్యోగులను సాగనంపడానికి ఎల్ ‌జీ పాలిమర్స్ రంగం సిద్ధం!

By:  Tupaki Desk   |   5 Jan 2021 5:34 PM IST
ఉద్యోగులను సాగనంపడానికి ఎల్ ‌జీ పాలిమర్స్ రంగం సిద్ధం!
X
ఎల్‌ జీ పాలిమర్స్‌ .... గత ఏడాది మే ఏడో తేదీన ఈ కంపెనీ నుండి ‌ స్టైరిన్ ‌వాయువు లీకవ్వడంతో 12 మంది మృతిచెందగా, వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోయింది. అదే సమయంలో జనావాసాల మధ్య నుంచి కంపెనీని మరోచోటకు తరలించాలనే డిమాండ్‌ వచ్చింది. దీనిపై అటు ప్రభుత్వం గానీ, ఇటు కంపెనీ యాజమాన్యం గానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటువంటి తరుణంలో ఉద్యోగులను వదిలించుకోవాలని యాజమాన్యం నిర్ణయించి వీఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చింది.

కంపెనీలో 248 మంది శాశ్వత ఉద్యోగులు, 370 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. శాశ్వత ఉద్యోగుల్లో 214 మంది అధికారులు కాగా మిగిలిన 34 మంది ఉద్యోగులు. శాశ్వత ఉద్యోగుల్లో 34 మంది అధికారులు ఇంకా అండర్‌ ట్రైనింగ్‌ లో ఉన్నారు. మరో 132 మంది ఐదేళ్ల క్రితమే సర్వీస్‌ లో చేరారు. అయితే శాశ్వత ఉద్యోగులందరూ వీఆర్ ‌ఎస్‌ తీసుకోవాలని ఆదేశించిన యాజమాన్యం...అందుకు గత నెల 19వ తేదీని గడువుగా నిర్ణయించింది. వీఆర్‌ ఎస్‌ కు దరఖాస్తు చేయకపోతే కంపెనీ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ సమయానికి 49 మంది అధికారులు వీఆర్‌ ఎస్‌ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరోసారి గడువు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఏడాది మార్చి 31లోగా మొత్తం అధికారులు, ఉద్యోగులకు వీఆర్‌ ఎస్‌ ఇచ్చేయాలని యాజమాన్యం వ్యూహం సిద్ధం చేస్తుంది.

కాగా కంపెనీలో 370 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరికి రోజుకు అన్ని కటింగ్స్‌ పోనూ రూ.530 చెల్లించేది. అయితే ప్రమాద ఘటన అనంతరం జూన్‌ నుంచి మూడు నెలల పాటు పూర్తిగా, సెప్టెంబరు నుంచి సగం వేతనం చెల్లించింది. డిసెంబరు 31 తరువాత కాంట్రాక్టు ఉద్యోగులకు కంపెనీతో సంబంధం లేదని యాజమాన్యం ప్రకటించింది. కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల వందలాది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడనున్నాయి. జిల్లా యంత్రాంగం ఈ విషయంపై దృష్టిసారించి తమకు తగిన పరిహారం అందేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు.