Begin typing your search above and press return to search.

జర్నలిస్టులను.. విద్యార్థుల్ని చితక్కొట్టేసిన లాయర్లు

By:  Tupaki Desk   |   15 Feb 2016 4:00 PM GMT
జర్నలిస్టులను.. విద్యార్థుల్ని చితక్కొట్టేసిన లాయర్లు
X
ఢిల్లీలో లాయర్లు రెచ్చిపోయారు. కోర్టు వద్ద వారి తఢాఖా చూపించి.. పలువురిని భయబ్రాంతులకు గురయ్యేలా చేశారు. జేఎన్ యూ వివాదంలోఅరెస్ట్ అయిన విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ బెయిల్ పిటీషన్ విచారణ పాటియాలా హౌస్ కోర్టులో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కోర్టుకు వెళ్లిన జేఎన్ యూ అధ్యాపకులు.. విద్యార్థులతో పాటు జర్నలిస్టులపైనా న్యాయవాదులు దాడి చేశారు.

భారత్ కు మద్దుతుగా నినాదాలు పలికిన లాయర్లు.. జేఎన్ యూకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయటం గమనార్హం. కోర్టు లోపల ఉన్న విద్యార్థులను బయటకు వెళ్లాలని లాయర్లు కోరటం.. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లుగా చెబుతున్నారు. విద్యార్థులు.. జర్నలిస్టులతోపాటు ఉపాధ్యాయుల మీద కూడా లాయర్లు దాడి చేసినట్లు చెబుతున్నారు.

అయితే.. దాడికి పాల్పడిన లాయర్లు బీజేపీకి చెందిన వారుగా చెబుతున్నారు. లాయర్లు కొడుతూ ఉంటే.. పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్పించి.. వారిని అడ్డుకోలేదని వాపోతున్నారు. అమాయకుల్ని పొట్టన పెట్టుకొనే ఉగ్రవాదుల్ని.. దేశద్రోహుల్ని కీర్తించటం.. వారికి మద్దతుగా వర్థంతి సభల్ని నిర్వహించటం లాంటివి లాయర్లకు మంట పుట్టించి ఉంటాయని.. దీనికి తోడు కోర్టు దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోవటంతో మరింతగా చెలరేగిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాయర్ల దాడిలో పలువురు విద్యార్థులు.. జర్నలిస్టులకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.