Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు బీపీ లేపే అజెండాతో ష‌ర్మిల పాద‌యాత్ర రీస్టార్ట్‌

By:  Tupaki Desk   |   1 March 2022 1:30 AM GMT
కేసీఆర్‌కు బీపీ లేపే అజెండాతో ష‌ర్మిల పాద‌యాత్ర రీస్టార్ట్‌
X
ఇటీవ‌లే ఎన్నిక‌ల సంఘం క‌ల్పించిన గుర్తింపుతో ఫుల్ జోష్‌లో ఉన్న వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల త‌న దూకుడు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలకు దిగారు. దీంతోపాటుగా త‌న పాద‌యాత్ర‌ను రీస్టార్ట్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. వైఎస్ షర్మిల చేపట్టబోయే ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పాద‌యాత్రను మ‌ళ్లీ ప్రారంభిస్తున్నట్లు ష‌ర్మిల తెలిపారు. మార్చి 10 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానున్నట్లు షర్మిల ప్రకటించారు.

గతేడాది డిసెంబర్ 9న ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం దగ్గర షర్మిల పాదయాత్రను నిలిపివేశారు. తిరిగి మళ్లీ నల్గొండ జిల్లా కొండపాక గూడెం గ్రామం నుంచి ష‌ర్మిల‌ పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. కాగా, ఈ ద‌ఫా నిరుద్యోగుల అంశాన్ని త‌న పాద‌యాత్ర‌లో ష‌ర్మిల హైలెట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. నోటిఫికేష‌న్ల భ‌ర్తీలో జాప్యాన్ని ప్ర‌శ్నిస్తూ వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ష‌ర్మిల దీనికి కొన‌సాగింపుగా తాజాగా పాద‌యాత్ర‌లో నిరుద్యోగుల‌తో ప‌లు కార్య‌క్ర‌మాలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా, దళితులపై మీద కేసీఆర్ లేని ప్రేమను నటిస్తున్నారని ష‌ర్మిల ట్విట్ట‌ర్లో ఆరోపించారు. ఎన్నికల కోసమే దళితబంధు పెట్టి అమలు చేయనప్పుడు.. వారికి జరుగుతున్న అన్యాయం గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు.

రాజ్యాంగంతో దళితుల జనాభాకు తగ్గట్లుగా న్యాయం చేయలేకపోతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసినప్పుడు.. తమ ఆధీనంలో ఉన్న SC & ST సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించినపుడు దళితులకు జరిగిన అన్యాయం గుర్తుకురాలేదా అని తెలంగాణ సీఎం ను ప్ర‌శ్నించారు.

‘మీరు దళితులకు చేసిన మోసాలు కనపడకూడదని, దళితుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కొత్త రాజ్యాంగం కావాలని నీతులు చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చుడు కాదు.. ఉన్న రాజ్యాంగంలో దళితుల హక్కులు అమలు చెయ్యండి. దళితులపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి’ అని షర్మిల ట్వీట్ చేశారు. ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగమన్నా ఖర్చు చేయలేదు’ పేరుతో వ‌చ్చిన వార్త‌ల‌ను ట్వీట్ చేస్తూ ఈ మేర‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మండిప‌డ్డారు.