Begin typing your search above and press return to search.

రానున్న 3 వారాలు ఎంత కేర్ ఫుల్ గా ఉండాలో చెప్పే తాజా నివేదిక

By:  Tupaki Desk   |   19 Jan 2022 3:40 AM GMT
రానున్న 3 వారాలు ఎంత కేర్ ఫుల్ గా ఉండాలో చెప్పే తాజా నివేదిక
X
మహమ్మారి మూడో వేవ్ వచ్చేసిన వైనం తెలిసిందే. అయితే.. దీని తీవ్రత ఎంతన్న విషయానికి సంబంధించి వార్తలు వస్తున్నా.. కళ్లకు కట్టేలా మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇలాంటివేళ తాజాగా విడుదలైన ఒక నివేదిక.. మూడో వేవ్ తీవ్రతను అందరికి అర్థమయ్యేలా తెలియజేయటమే కాదు.. స్పష్టమైన హెచ్చరికల్ని జారీ చేస్తోంది. తాజాగా ఎస్ బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కొవిడ్ కేసులు రానున్న మూడు వారాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.

గడిచిన నెల రోజులుగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు నగరాలకే పరిమితమైన కేసులు ఇప్పుడు గ్రామీణ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ తీవ్రత ఇప్పుడు పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. ఎస్ బీఐ అంచనా ప్రకారం ముంబయిలో ఈ నెల ఏడున 20,971 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ సీజన్లో ఇదే గరిష్ఠమని చెబుతున్నారు. అయితే.. రానున్న రెండు మూడు వారాల్లో జాతీయ గరిష్ఠ స్థాయికి కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

భారత దేశంలో కేసుల సంఖ్య పెరగటం డిసెంబరు 29నుంచి మొదలైంది. ఈ నెల 17న 2.38 లక్షల కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 16.56 లక్షలు. దేశంలో 64 శాతం మంది జనాభాకు ఇప్పటికే రెండు డోసుల టీకా వేయటం పూర్తైంది. టీకా వేసుకున్న వారిలో గ్రామీణ ప్రాంతాలప్రజలు 83 శాతం ఉన్నారు. ఈ కారణంగా చాలావరకుప్రజలు టీకాతో భద్రత కలిగి ఉన్నట్లుగా చెప్పొచ్చు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్ని చూస్తే..

- కేరళ
- పశ్చిమబెంగాల్
- మహారాష్ట్ర
- ఢిల్లీ
- తమిళనాడు
- కర్ణాటక
- ఆంధ్రప్రదేశ్

ఈ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే.. రెండో వేవ్ తో పోలిస్తే.. ఆసుపత్రుల మీద ఒత్తిడి తక్కువగా ఉంది. ముంబయిలో కొవిడ్ కేసులు 30-39 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా బయటపడుతున్నాయి. కానీ.. దీంతో మరణిస్తున్న వారి వయసు 60-69 ఏళ్ల మధ్య ఉంటోంది. ప్రస్తుతం కొవిడ్ కేసులు అమెరికాలో అత్యధికంగా నమోదవుతున్నాయి. దక్షిణాఫ్రికా.. బ్రెజిల్.. యూకే.. ఫ్రాన్స్.. జర్మనీ దేశాల్లో ఇప్పటికే కొవిడ్ మూడో విడత గరిష్ఠ స్థాయిలో నమోదువుతున్నాయి.

ఇప్పుడిప్పుడే ఆ దేశాల్లో కేసులు నమోదు తగ్గుముఖం పడుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగి.. గరిష్ఠ స్థాయికి చేరుకొని మళ్లీ తగ్గటానికి 54 రోజుల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో మన దేశంలో రానున్న మూడు వారాల సమయం చాలా ముఖ్యమని.. అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. సో.. బీకేర్ ఫుల్.