Begin typing your search above and press return to search.

హిజాబ్ వివాదం పై కీలక ప్రకటన చేసిన కర్ణాటక సర్కార్

By:  Tupaki Desk   |   23 Feb 2022 6:35 AM GMT
హిజాబ్ వివాదం పై కీలక ప్రకటన చేసిన కర్ణాటక సర్కార్
X
హిజాబ్ వివాదం పుట్టిన కర్ణాటకలో ఆ వివాదంపై ప్రభుత్వం తొలిసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. భారత్ లో హిజాబ్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. అయితే విద్యాసంస్థల్లో క్రమశిక్షణ పరంగా హిజాబ్ పై కొన్ని రకాల పరిమితులు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన విచారణ సందర్భంగా పిటీషనర్ తరుఫఉ న్యాయవాది చేసిన వాదనల్ని కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ వ్యతిరేకించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందన్న వాదన సరైంది కాదన్నారు. అయితే ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం హిజాబ్ ధరించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. దీని ప్రకారం కొన్ని సంస్థల్లో సహేతుకమైన కారణాలతో హిజాబ్ ధరించకూడదని చెప్పే అధికారాలు ఉంటాయని తన వాదనల్ని వినిపించారు.

ఫుల్ బెంచ్ ఈ వారంలో విచారణను పూర్తి చేయనుంది. హిజాబ్ పిటిషన్ దారుల్లో ఒకరైన హజ్రా షిఫా అల్లరి మూకలు తన సోదరుడిపై దాడికి దిగారని.. తమ ఆస్తులను ధ్వంసం చేశారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

తాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే దాడులకు దిగుతున్నారని హజ్రా షిఫా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సంఘ్ పరివార్ పనేనని ఆమె ఆరోపించారు.

-హిజాబ్ అంటే ఏమిటీ?
హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని ‘హిజాబ్ ’ అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.

1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.

గత నెలరోజులుగా కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి, చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.